SFI: ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు షురూ
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:58 AM
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తూ నయా ఫాసిస్టు విధానాలకు బీజం వేస్తోందని ఎస్ఎ్ఫఐ జాతీయ కార్యదర్శి వీపీ సాను విమర్శించారు.
ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తూ నయా ఫాసిస్టు విధానాలకు బీజం వేస్తోందని ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి వీపీ సాను విమర్శించారు. జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ ) అలుపెరగని పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. ఎస్ఎ్ఫఐ రాష్ట్ర ఐదో మహాసభలు శుక్రవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీపీ సాను మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రదాడులకు కేంద్ర ప్రభుత్వ భద్రతాలోపమే కారణమన్నారు.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడారని యూనివర్సిటీ విద్యార్థులపై, విద్యా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అభ్యుదయవాది, సినీ నటుడు మాదాల రవి మాట్లాడుతూ.. విద్యా సమస్యలపై పోరాటాలే ఏకైక మార్గమన్నారు. వామపక్షాలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. మహాసభల సందర్భంగా ఎస్ఎ్ఫఐ నాయకులు, విద్యార్థులు నగరంలోని జడ్పీ సెంటర్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు.
Updated Date - Apr 26 , 2025 | 05:35 AM