రేవంత్రెడ్డి క్వాష్ పిటిషన్పై తీర్పు వాయిదా
ABN, Publish Date - Jun 21 , 2025 | 04:08 AM
తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. గోపన్పల్లిలోని భూవివాదంపై రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఆయన సోదరుడు కొండల్రెడ్డి, మరో వ్యక్తి తనను కులం పేరుతో దూషించారంటూ ఎన్. పెద్దిరాజు కేసు పెట్టారు. అది శుక్రవారం జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పెద్దిరాజు తరఫు న్యాయవాది నిమ్మ నారాయణ వాదిస్తూ రేవంత్రెడ్డి ఆదేశాలతోనే ఆయనను దూషించారని, అందువల్ల కేసును కొట్టివేయకూడదని కోరారు. అంతకుముందు పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు, రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. సంఘటన స్థలంలో లేని వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టలేరని, భూవివాదాలకు అట్రాసిటీ చట్టం వర్తించదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును జూలై 18కి వాయిదా వేసింది.
ఆ కేసు కొట్టివేయండి: కేటీఆర్, జగదీశ్రెడ్డి
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫేక్ వీడియోలు పెట్టారని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని కేటీఆర్, జగదీశ్రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు, దర్యాప్తు అధికారి ఇచ్చిన నోటీసులకు ఫిర్యాదుదారు స్పందించలేదని.. ఆయనకే ఆసక్తి లేనందున కేసును కొట్టివేయాలని కోరారు. మల్లన్న తరఫు న్యాయవాది అంబేద్కర్ వాదిస్తూ.. తనకు ఇప్పుడే ఫిర్యాదుదారు నుంచి సూచన అందిందని, తమ వాదన వినాలని కోరారు. దాంతో విచారణ ఈనెల 27కు వాయిదాపడింది.
Updated Date - Jun 21 , 2025 | 04:08 AM