Asaduddin Owaisi: వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
ABN, Publish Date - May 22 , 2025 | 06:43 AM
వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ రెహమానీ డిమాండ్ చేశారు. ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు జరిపేలా ప్రజలను పిలుపునిచ్చారు.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ రెహమానీ
నల్లగొండ టౌన్, మే 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమిస్తామని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీద్ సైపుల్లా రెహమానీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లింల హక్కుల కాలరాసేందుకు జరుగుతున్న చర్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎ్సఎస్ కనుసన్నల్లో నడుస్తూ దేశాన్ని ముక్కలు చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. భారతదేశంలో ముస్లిం, ఆదివాసీలు ఎక్కడా కనపించడం లేదన్నారు. బంగ్లాదేశ్ పేరుతో సుమారు 8 వేల మంది ముస్లిం పేదలను అరెస్టు చేశారని ఆరోపించారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో పెద్దసంఖ్యలో మదర్సాలు మూసివేశారన్నారు. ఉత్తరాఖండ్లో ఏకరీతి పౌరసత్వాన్ని అమలు చేశారన్నారు. ఉత్తరప్రదేశ్లో నిరుపేద ముస్లింల గృహాలను బుల్డోజర్లతో కూల్చివేశారని చెప్పారు. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ను ఉపయోగించుకుని ముస్లింల హక్కులను కాలరాసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా లా బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే మానవహారం, జూన్ 1న డిల్లీలోని ఇందిరాగాందీ ఘాట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి ప్రసంగించారు. అంతకుముందు లాబోర్డు ఆధ్వర్యంలో నల్గగొండలో ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సహా పలువురు స్థానిక బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
Updated Date - May 22 , 2025 | 06:46 AM