High Court: పీజీ మెడికల్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట
ABN, Publish Date - Apr 04 , 2025 | 05:19 AM
ఫీజుల విషయమై పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల విద్యార్థులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ట్యూషన్ ఫీజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదని వైద్య కళాశాలలను ఆదేశించింది.
మిగిలిన ఫీజుపై ఒత్తిడి చేయొద్దని కాలేజీలకు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఫీజుల విషయమై పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల విద్యార్థులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ట్యూషన్ ఫీజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదని వైద్య కళాశాలలను ఆదేశించింది. అయితే పిటిషన్ వేసిన విద్యార్థులకే ఆ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2023-2026 బ్లాక్ పీరియడ్కు మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీటు ట్యూషన్ ఫీజును ఏడాదికి రూ.5.8 లక్షల నుంచి రూ.24 లక్షలకు, కన్వీనర్ కోటా ఫీజును రూ.3.2 లక్షల నుంచి రూ. 7.75 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
దీన్ని సవాల్ చేస్తూ డాక్టర్ అద్వైత శంకర్ సహా 124మంది మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టేసింది. దీంతో పిటిషనర్లందరూ హైకోర్టు డివిజన్ బెంచ్లో రిట్ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుకతో కూడిన ద్విసభ్య దర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. మిగిలిన ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి చేయరాదని, వారిని తరగతులకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను పదిరోజులకు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News
Updated Date - Apr 04 , 2025 | 05:19 AM