గోదావరి-కావేరీ అనుసంధానం సాధ్యమేనా?
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:42 AM
గోదావరి - కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 11:30 గంటలకు హైదరాబాద్లో జాతీయ నీటిఅభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ జరగనున్నది.
24న హైదరాబాద్లో నదుల అనుసంధాన సంప్రదింపుల కమిటీ భేటీ
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 11:30 గంటలకు హైదరాబాద్లో జాతీయ నీటిఅభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ జరగనున్నది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. కేంద్రం ఇప్పటి వరకూ పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును ఒప్పుకోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం న్యూఢిల్లీలో జరిగిన నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకొచ్చిందని ఆరా తీసినట్లు సమాచారం.
ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలని పట్టుబట్టిన ఏపీ.. తాజాగా రూట్ మార్చి గోదావరి-బనకచర్ల అనుసంధానంలో భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో నిర్మించే 173 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నుంచే ‘బొల్లాపల్లి-కావేరీ అనుసంధానం’ చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. పోలవరం విస్తరణలో భాగంగా రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు కొత్తగా గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది. అంతటితో ఆగక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 46(2), 46(3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరిట గోదావరి-బనకచర్ల అనుసంధానానికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు కోరుతున్నది. బొల్లాపల్లి-కావేరీ అనుసంధానానికి ఒప్పుకుంటే మాత్రం.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది.
Updated Date - Jun 13 , 2025 | 04:42 AM