MP Raghunandan: ఎంపీ రఘునందన్కు మళ్లీ బెదిరింపు కాల్
ABN, Publish Date - Jun 30 , 2025 | 05:38 AM
ఎంపీ రఘునందన్ రావుకు ఆదివారం మళ్లీ బెదిరింపులు వచ్చాయి. తమ బృందాలు హైదరాబాద్లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోవాలని దుండగులు సవాల్ చేశారు.
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఎంపీ రఘునందన్ రావుకు ఆదివారం మళ్లీ బెదిరింపులు వచ్చాయి. తమ బృందాలు హైదరాబాద్లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోవాలని దుండగులు సవాల్ చేశారు. దీనిపై రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం యశోద హాస్పిటల్లో కాలికి ఆపరేషన్ చేయించుకుని రఘునందన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 9489556347, 7365035440 నంబర్ల నుంచి తనకు నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన పోలీసులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు తనను చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగినట్లు వారు హెచ్చరించారని పేర్కొన్నారు.
తమ సమాచారం దొరకదని, తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని బెదిరించారని ఆయన వివరించారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని డిమాండ్ చేశారని రఘునందన్ వెల్లడించారు. కాగా, ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పలుమార్లు రఘునందన్కు బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఆయన డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు చేయగా.. అదనపు భద్రత కల్పించారు.
Updated Date - Jun 30 , 2025 | 05:38 AM