Mahesh Kumar Goud: బహుజనుల వికాసం వెనుక జ్యోతిరావు ఫూలే కృషి
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:45 AM
బహుజనులు చదువుకుని నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక నాటి జ్యోతిరావు ఫూలే కృషి దాగి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): బహుజనులు చదువుకుని నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక నాటి జ్యోతిరావు ఫూలే కృషి దాగి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. మహిళలు చదువుకుంటే నేరంగా పరిగణించే రోజుల్లో అగ్రవర్ణ సమాజాన్ని ఎదిరించి సావిత్రిబాయిని చదివించి యావత్ మహిళా లోకానికి ఫూలే నూతన ఒరవడి సృష్టించారని పేర్కొన్నారు. పార్టీ నాయకులతో కలిసి పంజాగుట్ట పీవీఆర్ సినిమాలో శనివారం జ్యోతిరావు ఫూలే చలనచిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన కథను సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఫూలే చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని కోరానని తెలిపారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత స్వేచ్ఛ మృతిపై మ హేశ్కుమార్గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆమె తండ్రి చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
క్యాబినెట్లో చోటే కాదు పవర్ఫుల్ శాఖే రావచ్చు
పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి
పరిగి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపై పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి క్యాబినెట్లో తనకు శక్తిమంతమైన శాఖ రావచ్చునని పేర్కొన్నారు. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు- పరిశీలకులు వినోద్ కుమార్ రెడ్డి, సహ పరిశీలకులు శేటి నరేందర్ సమక్షంలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మా కుటుంబం 4 తరాలుగా పార్టీలో పని చేసున్నది. 5సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తిని ఓడించా. తెలంగాణలో 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు గెలిచినా క్యాబినెట్లో చోటు దక్కని వ్యక్తిని నేనొక్కడినే.
దీనిపై అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ పరిశీలనలో ఉంది. రాష్ట్ర క్యాబినెట్లో హోం, విద్య, మునిసిపల్ శాఖలు ఖాళీ గా ఉన్నాయి. అదృష్టం వరిస్తే ఈ మూడు శాఖల్లో ఏదైనా ఒకటి రావచ్చు’ అని రామ్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. పరిగి చెరువు ఈశాన్యంలో ఉండటంతో అంతా మంచే జరిగేదని పెద్దలు చెప్పే వారని, తర్వాత చెరువు పూడ్చి ప్లాట్లు వేయడం వల్ల దిశ (గుర్తింపు) తగ్గిందన్నారు. రాష్ట్రంలో పరిగికి మంచి గుర్తింపు తేవడానికి చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
Updated Date - Jun 29 , 2025 | 03:45 AM