KTR: కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనీశ్వరం: కేటీఆర్
ABN, Publish Date - Mar 03 , 2025 | 03:54 AM
‘కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
సిరిసిల్ల/హైదరాబాద్, మార్చి2 (ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్లో పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండ లం దేవునిగుట్ట తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతంలో చాలామంది రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు రాక తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లోనూ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. 48 గంటల్లో నీళ్లను వదిలిపెట్టకపోతే మంత్రి చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే 450 మంది రైతులను సీఎం రేవంత్రెడ్డి పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీళ్లేమో పాతాళంలోకి పోయాయని, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయని, నియామకాలు గాల్లో కలిసిపోతున్నాయని విమర్శించారు. మిడ్ మానేరులో ప్రస్తుతం 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఒక టీఎంసీని మల్కపేట రిజర్వాయర్కు వదలిపెట్టాలని.. లేదంటే అన్నదాతలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, పరిపాలన చేతగాక.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోందని, అందుకే ఆయన నోటికొచ్చినట్లు కేసీఆర్ను, బీఆర్ఎ్సను విమర్శిస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి బీ-టీంగా కాంగ్రెస్ పనిచేస్తోందని, కేవలం బడే భాయ్ మోదీ కళ్లల్లో ఆనందం కోసం చోటే భాయ్ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు.
Updated Date - Mar 03 , 2025 | 03:54 AM