Security Mock Drill: హైదరాబాద్లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
ABN, Publish Date - May 06 , 2025 | 04:16 PM
Security Mock Drill: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై తీవ్ర చర్యలకు ఉపక్రమించేందుకు భారత్ సిద్దమవుతోంది. అందులోభాగంగా భారత్ ప్రభుత్వం అంతర్గతంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులోభాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది.
హైదరాబాద్, మే 06: భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ను రక్షణ శాఖ బృందాలు నిర్వహించనున్నాయి. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్ బాగ్, మల్లాపూర్లోని ఎన్ఎఫ్సీలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాదుల వెనుక పాకిస్థాన్ హస్తముందనేందుకు బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వీటిని ప్రపంచదేశాల ముందు ఉంచింది. ఆ క్రమంలో పాకిస్థాన్కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది. సింధు జాలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.
దీంతో పాక్కు చుక్క నీరు వెళ్లడం లేదు. అలాగే భారత్ గగనతరంలో పాక్ విమానాలను నిషేధించింది. ఇక పాకిస్థాన్ను అష్టదిగ్బందం చేసేందుకు భారత్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నింటిని చేస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను ఏకాకిని చేసేందుకు భారత్ తన ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. మరోవైపు ప్రధాని మోదీ.. త్రివిధ దళాల అధిపతులతో వరుసగా సమావేశమయ్యారు.
సోమవారం రక్షణ శాఖ కార్యదర్శితో సైతం ప్రధాని మోదీ సమావేశమైయ్యారు.ప్రధాని మోదీ ఇలా వరుస భేటీతో.. పాకిస్థాన్పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. అదీకాక.. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్లో బుధవారం సాయంత్రం 4.00 గంటలకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇంకోవైపు ఢిల్లీ, ముంబయి, చెన్నై తదితర నగరాలతోపాటు 259 ప్రదేశాల్లో మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించనున్నారు.
For Telangana News And Telugu News
Updated Date - May 06 , 2025 | 04:27 PM