Hyderabad: మీర్పేట్ యువకుడు సౌతాఫ్రికాలో దుర్మరణం
ABN, Publish Date - Jun 05 , 2025 | 07:54 AM
సౌతాఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మారుతీనగర్కు చెందిన లిఖిత్గౌడ్ అనే యువకుడు సౌతాఫ్రికా వెళ్లాడు. అయితే.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత్గౌడ్ మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- ఉపాధి కోసం వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి
- నేడు మృతదేహం మీర్పేట్కు చేరుకునే అవకాశం
హైదరాబాద్: కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో దేశంకాని దేశం వెళ్లిన ఓ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దాంతో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలాపూర్ మండలం మీర్పేట్ కార్పొరేషన్(Meerpet Corporation)లోని మారుతీనగర్కు చెందిన దుర్గాపతి ప్రమోద్గౌడ్ కుమారుడు లిఖిత్గౌడ్ (27) ఏడాదిన్నర క్రితం సౌతాఫ్రికాలోని బొత్స్వానాలోని స్ర్పౌట్ డ్రిల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా ఉద్యోగంలో చేరాడు.
అక్కడ తన మిత్రులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 30న కంపెనీ పని నిమిత్తం సిబ్బందితో కలిసి కారులో వెళ్తుండగా వేగంగా దూసుకువచ్చిన భారీ వాహనం వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిఖిత్గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం విషయం తెలియగానే లిఖిత్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చెట్టంత కొడుకు ఇక లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా లిఖిత్ మృతదేహానికి పోస్టుమార్టం కార్యక్రమాలు పూర్తి చేసి మీర్పేట్కు పంపించడానికి అక్కడి భారత హైకమిషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నానికి మృతదేహం మారుతీనగర్లోని నివాస గృహానికి చేరుకునే అవకాశమున్నదని కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 05 , 2025 | 07:54 AM