Heavy Rainfall: నట్టేట ముంచిన అకాల వర్షం
ABN, Publish Date - May 07 , 2025 | 06:55 AM
క్రమంగా కురిసిన అకాల వర్షాలు, గాలివానతో రైతులకు నష్టం కలిగింది. ధాన్యాలు తడిసి రైతులు మార్కెట్లలో అవస్థలు ఎదుర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గాలివాన బీభత్సం
తడిసిపోయిన ధాన్యం
పలు జిల్లాలకు నేడు, రేపు వర్షసూచన
ఆంధ్య్రజ్యోతి న్యూస్ నెట్వర్క్
పలు జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులను నట్టేట ముంచాయి. జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం రాత్రి గాలివానకు పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు రాలిపోయాయి. కల్లాలు, మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల సుమారు రెండు గంటలకు పైగా వీచిన బలమైన గాలులకు జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, రైస్ మిల్లుల పైకప్పు రేకులు ఎగిరిపోగా, షెడ్లు, గోడలు కూలిపోయాయి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో వాతావరణం వేడిగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షంతో రోడ్లు మునిగిపోయాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. జిల్లాలో వైరా కొణిజర్ల, ఏన్కూరు, ముదిగొండ, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లోనూ భారీగా వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. వైరాలో చెట్లు నేలకూలాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎదులాబాద్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యమంతా పక్కనే ఉన్న కాలువలోకి కొట్టుకుపోయింది. తూకమేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. ఉదయం రైతులు కాలువలో నుంచి ధాన్యాన్ని తీసి ఆరబెట్టుకున్నారు. ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించేందుకు అధికారులు లారీలను ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఎదులాబాద్, మాధారం కేంద్రాల్లో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోందని తెలిపారు. కాగా, కొన్ని జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, యాదాద్రి, జనగామ, మంచిర్యాల, ఆసిఫాబాద్, నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. కాగా, మంగళవారం నిజామాబాద్ జిల్లా మెండోరాలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్కు చెందిన తునికి అమరావతి (40) అనే మహిళ వడదెబ్బతో సోమవారం అర్ధరాత్రి మృతిచెందింది.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మార్కెట్ తీసుకొచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ గేటును మూసివేశారు. సాయంత్రం వేళల్లో వర్షాలతో ధాన్యంలో కొంతమేర తేమ ఉందని తెలిపారు. దీంతో అధికారులు రైతులను సముదాయించి, వ్యాపారులను పిలిపించి, వారు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు.
Updated Date - May 07 , 2025 | 06:57 AM