High Court: 132 కిలోల మత్తుపదార్థాల పట్టివేత కేసులో బెయిల్ ఇవ్వలేం: హైకోర్టు
ABN, Publish Date - May 17 , 2025 | 04:24 AM
మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (ఎన్డీపీఎస్ యాక్ట్) ప్రకారం 100 గ్రాములకు మించి మత్తుపదార్థాలు కలిగి ఉండడం తీవ్రమైన నేరమని హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (ఎన్డీపీఎస్ యాక్ట్) ప్రకారం 100 గ్రాములకు మించి మత్తుపదార్థాలు కలిగి ఉండడం తీవ్రమైన నేరమని హైకోర్టు తెలిపింది. 132 కిలోల ఆల్ర్పాజోలం అనే మత్తుపదార్థాన్ని ఉత్పత్తి చేసిన కేసులో దోషిగా తేలిన పిటిషనర్కు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా జిన్నారం అనంతారం గ్రామంలోని వెంకటరాఘవ ల్యాబ్స్లో బండారు హనుమంత్రెడ్డి, వాసంశెట్టి నరేశ్ మరికొంత మందితో కలిసి ఆల్ర్పాజోలంను ఉత్పత్తి చేస్తున్నారనే సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2016లో దాడులు చేశారు.
వారివద్ద నుంచి 132 కిలోల ఆల్ర్పాజోలం, ఉత్పత్తి యంత్రాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నిరూపితం కావడంతో నిందితులకు సంగారెడ్డి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దోషి వాసంశెట్టి నరేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మత్తుపదార్థాలు 100 గ్రాముల పరిమాణం దాటితే తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని తెలిపింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి కోర్టులు అంతగా సుముఖత వ్యక్తం చేయవని వ్యాఖ్యానించింది.
Updated Date - May 17 , 2025 | 04:24 AM