High Court: నిషేధిత జాబితాలో పెట్టమంటే నిర్మాణాలా?
ABN, Publish Date - Jul 02 , 2025 | 03:55 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే 181,182, 194, 195 నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అందులో నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేస్తూ కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది.
నాగారం భూములపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి
రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే 181,182, 194, 195 నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అందులో నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేస్తూ కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. భూదాన్ భూములుగా భావిస్తున్న వాటి స్వభావాన్ని మార్చరాదని, క్రయవిక్రయాలు జరపరాదన్న ఆదేశాలను ఉల్లంఘించినట్టు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పలువురు ఐఏఎస్, ఐపీఎ్సలు తప్పుడు పత్రాలతో రికార్డులు మార్చి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంటూ ఈ ఏడాది ఏప్రిల్లో మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన ధర్మాసనం ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరిస్తూ తాజాగా సర్వే నెంబర్ 194లో నిర్మాణాలు చేపడుతున్నారని బిర్ల మల్లేశ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై పరిశీలన జరిపి రెండువారాల్లో నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.
Updated Date - Jul 02 , 2025 | 03:55 AM