Harish Rao: ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం
ABN, Publish Date - Jul 01 , 2025 | 03:52 AM
సిగాచి పరిశ్రమలో పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చిన కార్మికులు బలికావడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
క్షతగాత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించాలి: హరీశ్
పటాన్చెరు, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమలో పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చిన కార్మికులు బలికావడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పేలుడు జరిగిన పరిశ్రమను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఐదు గంటలైనా ఇంకా ఎంతమంది చనిపోయారో చెప్పకపోవడం దారుణమన్నారు. 40-70శాతం కాలిన గాయాల బారిన పడ్డ వారిని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించకుండా కాలయాపన చేయడమేంటని మండిపడ్డారు.
గోల్డెన్ అవర్(మొదటి గంట)లోనే ఆధునిక చికిత్స అందిస్తే కాలిన గాయాలతో ఉన్న కార్మికుల ప్రాణాలు కాపాడుకోలగమన్నారు. గల్లంతైన వారి సమాచారం ఇచ్చేందుకు కనీసం హెల్ప్డెస్క్, టోల్ఫ్రీ అత్యవసర కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.50లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 01 , 2025 | 03:52 AM