High Court: డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛను విధానం వర్తింపు
ABN, Publish Date - Jul 30 , 2025 | 04:54 AM
డీఎస్సీ - 2003లో ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు వరకు అమలైన పాత పింఛను విధానమే వర్తిస్తుందని మంగళవారం తీర్పు ఇచ్చింది.
నియామకాల తేదీ కన్నా నోటిఫికేషన్ సంవత్సరమే లెక్క: హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ - 2003లో ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు వరకు అమలైన పాత పింఛను విధానమే వర్తిస్తుందని మంగళవారం తీర్పు ఇచ్చింది. తమకు పాత పింఛను విధానం వర్తింపజేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలువురు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి 2003 నవంబరులో నోటిఫికేషన్ రాగా, జూన్ 2004 నాటికి మొత్తం ఎంపిక పూర్తయిందని తెలిపారు.
2005 నవంబరులో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. ఈలోపు కొత్తగా కాంట్రిబ్యూటరీ పింఛను విధానం 2004 సెప్టెంబరు 1 నుంచి అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. కొత్త పింఛను విధానం అమలులోకి రాకముందే ఎంపిక ప్రక్రియ పూర్తయింది కాబట్టి పాత పింఛను విధానమే వర్తింపజేయాలని కోరారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. వారికి పాత పింఛను విధానం వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై తెలంగాణ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 30 , 2025 | 04:54 AM