Drug Party: సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ
ABN, Publish Date - Jul 28 , 2025 | 04:00 AM
ఐటీ కారిడార్లోని కొండాపూర్లో.. ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ముఠా ఆటను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం కట్టించింది.
మత్తు కోసం ఏపీ నుంచి నగరానికి..
9 మంది అరెస్టు.. డ్రగ్స్ స్వాధీనం
సీజ్ చేసిన కార్లలో ఒకదానిపై ఎంపీ స్టిక్కర్
బడాబాబుల పిల్లల పాత్రపై అనుమానం
హైదరాబాద్ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఐటీ కారిడార్లోని కొండాపూర్లో.. ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ముఠా ఆటను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం కట్టించింది. నిందితులంతా ఏపీకి చెందినవారే..! ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారి ప్రదీ్పరావు కథనం ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన అశోక్ నాయుడు కొండాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఏపీకి చెందిన కెంగర్ రాహుల్, ఉన్నాటి ఇమాన్యుయేల్ అలియాస్ అనీల్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నేల నుంచి ఇతను డ్రగ్స్(ఓజీకుష్, మ్యాజిక్ మష్రూమ్, చరస్, ఎల్ఎ్సడీ బ్లాట్స్, గంజాయి) కొనుగోలు చేస్తూ, సర్వీస్ అపార్ట్మెంట్లలో డ్రగ్స్, రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో కొండాపూర్ జేవీజీ హిల్స్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ను బుక్ చేశారు.
విజయవాడ, మంగళగిరి, కాకినాడ, రాజమండ్రికి చెందిన సమ్మెల సాయికృష్ణ, నాగెళ్ల లీలామణికంఠ, హిల్టన్ జోసఫ్ రోల్ఫ్, అడప యశ్వంత్ శ్రీదత్త, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజలను పార్టీకి ఆహ్వానించారు. వీరంతా పార్టీలో ఉండగా.. ఉప్పందుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం దాడి చేసి, అశోక్నాయుడు, అతని కస్టమర్లను అరెస్టు చేసింది. వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. నిందితుల నుంచి 2.08 కిలోల గంజాయి, 50 గ్రాము ల ఓజీకుష్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చరస్, 4 ఎల్ఎ్సడీ బ్లాట్లు, రెండు ఫోర్డ్ కార్లు(ఏపీ07సీయూ-7154, ఏపీ39ఎ్సఆర్-0001), రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు శ్రీనివాస్ చౌదరి అలియాస్ వాసు, అఖిల్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన కార్లలో ఒకదానిపై ఎంపీ స్టిక్కర్ ఉండడంతో.. ఈ కేసులో బడాబాబుల పిల్లల పాత్ర ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
Updated Date - Jul 28 , 2025 | 04:00 AM