Online Admissions: దోస్త్ నోటిఫికేషన్ జారీ
ABN, Publish Date - May 03 , 2025 | 04:52 AM
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఆన్లైన్ అడ్మిషన్ల (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు
10 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు
29న సీట్ల కేటాయింపు
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఆన్లైన్ అడ్మిషన్ల (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్- దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి (టీఎ్సబీటెట్), జేఎన్టీయూల్లోని కోర్సుల్లో చేరదలిచిన విద్యార్థులు.. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తొలివిడత అడ్మిషన్ల కోసం రూ.200 చెల్లించి ఈ నెల 3-20 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 నుంచి 22 వరకూ సంబంధిత కాలేజీల్లో కోర్సుల కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. దివ్యాంగులకు 21న, ఎన్సీసీ/ స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు 22న సర్టిఫికెట్ల ధ్రువీకరణ ఉంటుంది. 29న సీట్లు కేటాయిస్తారు. రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుతో ఈ నెల 30 నుంచి జూన్ ఆరో తేదీ వరకూ రెండో విడత అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల 13న సీట్లు కేటాయిస్తారు. అదే రోజు మూడో విడత అడ్మిషన్లకు రూ.400 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి, రెండో, మూడో విడత సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24-28 తేదీల మధ్య సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ తొలి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.
Updated Date - May 03 , 2025 | 04:52 AM