Ramchander Rao: మాపై తోస్తే ఎట్లా
ABN, Publish Date - Jul 31 , 2025 | 05:30 AM
ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పాపాన్ని తమ మీదకు తోస్తే ఎట్లా
ఏపీ నుంచి ఐదు పంచాయతీలను వెనక్కి తీసుకురావడంపై పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
భద్రాద్రి ఆలయానికి కేంద్రం నిధులిచ్చింది
రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
భద్రాచలం/ఇల్లెందు రూరల్/ పాల్వంచ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పాపాన్ని తమ మీదకు తోస్తే ఎట్లా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీలోకి వెళ్లిన కొన్ని ప్రాంతాల విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి కేంద్ర సర్కారు, తెలంగాణ ఆవిర్భవిస్తున్న సమయంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలనే కేంద్రంలో తాము అధికారంలో వచ్చాక అమలు చేశాం అని చెప్పారు. అయితే భద్రాద్రి జిల్లా వాసుల మనోభావాలను గుర్తించి ఏపీలోకి వెళ్లిన ఆ ఐదు పంచాయతీలను వెనక్కి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని, ఈ విషయాన్ని పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బుధవారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం అక్కడ, ఇల్లెందు, పాల్వంచల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో అఽధికారంలో ఉన్న పార్టీగానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే రామాలయ అభివృద్ధికి ప్రసాద్ పథకంలో భాగంగా రూ.98 కోట్లు కేటాయించిందని, తొలి విడతలో రూ.43 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిలో రామాలయాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. హిందూ ఆలయాలు, సంస్థలపై ఇటీవల దాడులు జరుగుతున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం మాట్లాడేందుకు కూడా సాహసించడం లేదని.. ఇది మంచిపద్ధతి కాదని విమర్శించారు. ఏపీలోని పురుషోత్తపట్నంలో భద్రాద్రి ఆలయ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి జరిగితే తొలుత తానే స్పందించానన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ డ్రామాలాడుతోందని, గతంలో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తామని బీఆర్ఎస్ చెప్పిందని.. ఈ రెండు పార్టీలు బీసీలను మోసగించాయని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు 10ు రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోందని, కాంగ్రె్సలోనే కొం తమంది అగ్రనాయకులు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరు పాకిస్థాన్ కు మద్దతు పలుకుతున్నట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 19నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బీజేపీపట్ల సామాన్య ప్రజలు, మేధావులు కూడా అకర్షితులవుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News
Updated Date - Jul 31 , 2025 | 05:30 AM