ఈడీ వర్సెస్ సీఐడీ!
ABN, Publish Date - Mar 10 , 2025 | 04:37 AM
ఎలాంటి ఆధారాల్లేవని, కేసును మూసివేయాలని సీఐడీ పట్టుబడుతుండగా.. ఆధారాలున్నాయి, సీఐడీ పునరాలోచించుకోవాలంటూ ఈడీ చెబుతోంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కూడా సీఐడీ నిర్ణయాన్ని తప్పుబట్టడం గమనార్హం.
ఆధారాలేవన్న సీఐడీ.. కోర్టుకు చేరిన వ్యవహరం
ఆధారాలున్నాయి.. కేసు మూసేయవద్దన్న ఈడీ
సీఐడీ తీరుపై హైదరాబాద్ సీపీ అసహనం
కేసును మళ్లీ తెరవాలంటూ డీజీపీకి లేఖ
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఆ రెండూ నేరస్థుల పాలిట సింహస్వప్నాలుగా పేరొందిన విభాగాలే..! ఒకటి నేరాలపై రాష్ట్రస్థాయిలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐడీ అయితే.. రెండోది జాతీయ స్థాయిలో మనీల్యాండరింగ్, విదేశాలతో అక్రమ లావాదేవీలపై దృష్టి సారించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)..! ఇప్పుడు ఈ రెండు విభాగాల మధ్య ఓ ఆర్థిక నేరానికి సంబంధించి పంచాయితీ మొదలైంది. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును మూసివేయాలని సీఐడీ పట్టుబడుతుండగా.. ఆధారాలున్నాయి, సీఐడీ పునరాలోచించుకోవాలంటూ ఈడీ చెబుతోంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కూడా సీఐడీ నిర్ణయాన్ని తప్పుబట్టడం గమనార్హం..!
జీడీఆర్ కుంభకోణం..
2010లో ఉమ్మడి ఏపీలో ఫార్మెక్స్ ఇండియా కంపెనీ లిమిటెడ్(ఎ్ఫఐసీఎల్) గ్లోబల్ డిపాజిటరీ రిసి్ప్ట్స(జీడీఆర్) కేసు సంచలనం సృష్టించింది. రూ.370 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు అప్పట్లో దర్యాప్తు అధికారులు తేల్చారు. కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఇప్పుడు ఈ కేసు హాట్టాపిక్గా మారింది. సరైన ఆధారాల్లేనందున కేసును మూసివేయాలంటూ సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) గత ఏడాది అక్టోబరులో ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విషయం తెలుసుకున్న ఈడీ.. సీఐడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న ప్రొటెస్ట్ పిటిషన్ వేసింది. ‘‘ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలుగా రూ.124.79 కోట్ల ఆస్తులను అటాచ్ చేశాం. అవన్నీ నిందితులైన కంపెనీ ప్రమోటర్లు, ఫండ్ రెగ్యులేటర్లు అయిన లండన్కు చెందిన అరుణ్ పంచారియా, దుబాయ్కి చెందిన సంజయ్ అగర్వాల్, హైదరాబాద్లో నివసించే ఎం.శ్రీనివా్సరెడ్డి, ఎం.మల్లారెడ్డిలకు సంబంధించిన ఆస్తులు’’ అని ప్రొటెస్ట్ పిటిషన్లో ఈడీ స్పష్టం చేసింది. నేరాన్ని నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నాయని, నిందితులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనడానికి సాక్ష్యాలున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఫార్మెక్స్ ఇండియా ఆర్థిక సలహాదారు అగర్వాల్తోపాటు.. పలువురిని అరెస్టు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సైతం సీఐడీ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తూ, ఫార్మెక్స్ ఇండియా కేసును మళ్లీ తెరవాలని.. తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. ఒక కేసుకు సంబంధించి ఇన్ని విభాగాల మధ్య విభేదాలుండడం ఇదే మొదటిసారి..!
నిర్ధారించిన సెబీ
సెబీ కూడా 2020 జూలై 15న జీడీఆర్ మోసాన్ని నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. ఫార్మెక్స్ ఇండియా సంస్థ మోసపూరితంగా వ్యవహరించి జీడీఆర్లను దుర్వినియోగం చేసిందని, షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని స్పష్టం చేసింది. ఈ కంపెనీని స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధించింది. కంపెనీ డైరక్టర్లు ఎం.శ్రీనివాసరెడ్డి, అరుణ్ పచారియా, వింటేజ్ ఎఫ్జడ్ఈలు ఈ మోసానికి పాల్పడ్డారని తేల్చిచెబుతూ.. ఫార్మెక్స్ ఇండియాకు రూ.50 లక్షల జరిమానా విధించింది. సెబీ తన తీర్పులో పలు అంశాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. అవి.. ఫార్మెక్స్ ఇండియా లిమిటెడ్(ఎ్ఫఐఎల్) కంపెనీ 71.91 మిలియన్ విలువైన(నాటి విలువ రూ.370కోట్లు) 51 లక్షల జీడీఆర్లను జారీ చేసింది. వీటిని వింటేజ్ ఎఫ్జడ్ఈ సబ్స్ర్కైబ్ చేసింది. ఆ తర్వాత వింటేజ్ కంపెనీ దుబాయ్లోని ఈరం బ్యాంకులో జీడీఆర్లను తనఖా పెట్టి.. రుణం తీసుకుంది. అరుణ్ పచారియా ఈ రుణాన్ని వివిధ కంపెనీలకు మళ్లించారు. దీనివల్ల ఎఫ్ఐఎల్, దాని షేర్ హోల్డర్లకు 72.20 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఈ మోసపూరిత వ్యవహరంలో కేవలం ఎఫ్ఐఎల్, వింటేజ్ మాత్రమే కాకుండా ప్రాస్పెక్ట్ కాపిటల్ లిమిటెడ్, జాన్ బెహర్, నితీశ్ బన్గెరా, ఫండ్ మేనేజర్లు అయిన ఇండియా ఫోకస్ కార్డినల్ ఫండ్, హై బ్లూస్క్లె ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్ పాత్ర ఉంది.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here
Updated Date - Mar 10 , 2025 | 04:37 AM