Kamalasan Reddy: అత్యవసర సేవల్లో డయల్ 112
ABN, Publish Date - Jun 07 , 2025 | 04:14 AM
అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం ఆదేశాలతో ఏర్పాటయిన డయల్ 112 సమర్థమైన సేవలను అందిస్తోందని టీజీఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కత్తిపోట్లకు గురైన వ్యక్తిని కాపాడిన ఫోన్కాల్
టీజీఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం ఆదేశాలతో ఏర్పాటయిన డయల్ 112 సమర్థమైన సేవలను అందిస్తోందని టీజీఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచాడని, గాయపడిన అతని పరిస్ధితి విషమంగా ఉందంటూ గురువారం రాత్రి 10.07 నిమిషాలకు డయల్ 112 సిబ్బందికి ఒకరు ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ‘గాయపడిన వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని తంగోజీపేట తండాలో ఉన్నాడని తెలిసింది.
కంట్రోల్ రూం నుంచి బాన్స్వాడ పోలీసులను అప్రమత్తం చేశాం. ఐదు నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అదే సమయానికి ఆంబులెన్స్ను పంపించాం. బాధితుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది’అని వివరించారు. రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా ఆపదలో ఉన్నామని 112నంబర్కు కాల్ వస్తే శరవేగంతో స్పందిస్తామని తెలిపారు.
Updated Date - Jun 07 , 2025 | 04:14 AM