BC Reservation: మరోసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:11 AM
బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటే 20 నెలలు ఆలస్యమెందుకు చేశారు.. అది జరగదని తెలిసే.. సీఎం రేవంత్రెడ్డి మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ బీసీ నాయకులు ఆరోపించారు.
చట్టబద్ధత లేకుండా ఆర్డినెన్సా?: బీఆర్ఎస్ బీసీ నేతలు
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటే 20 నెలలు ఆలస్యమెందుకు చేశారు.. అది జరగదని తెలిసే.. సీఎం రేవంత్రెడ్డి మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ బీసీ నాయకులు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు తలసాని శ్రీనివాసయాదవ్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, దాసోజు శ్రవణ్, వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు తరహాలో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతోందని, చటబద్ధత లేకుండా ఆర్డినెన్స్లు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని బీసీల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేయొద్దని, ఆర్డినెన్స్లను కోర్టులు కొట్టివేస్తాయన్న విషయాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లాలని సూచించారు. తెలిసీ.. బీసీలకు ద్రోహం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్తో అసెంబ్లీలో, బయట కూడా బీఆర్ఎస్ తరఫున పోరాడామన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 04:11 AM