Bhatti Vikramarka: బీసీ బిల్లుపై ఏడాదిగా కసరత్తు
ABN, Publish Date - Mar 18 , 2025 | 03:51 AM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు తీసుకురావడానికి ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిని కలుస్తాం
పార్లమెంటులోనూ బిల్లు పెట్టాలి: భట్టి
తమిళనాడు స్ఫూర్తితో సాధిస్తాం: పొన్నం
హైదరాబాద్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు తీసుకురావడానికి ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామన్న రాహుల్గాంధీ హామీని నెరవేర్చామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 రోజుల్లోనే శాస్త్రీయంగా కులగణన సర్వే చేపట్టామని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సి వస్తే.. రాష్ట్రంలో చేసిన సర్వేను మోడల్గా తీసుకునేంత శాస్ర్తీయంగా చేయించామన్నారు. అఖిలపక్ష నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్లి మోదీని కలుస్తామని, పార్లమెంట్లోనూ బిల్లు పెట్టాలని కోరుతామన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. అప్పట్లో తమిళనాడు సీఎం జయలలిత ఢిల్లీలో కూర్చుని ఇస్తవా.. చస్తవా అనే ధోరణితో వ్యవహరించి రిజర్వేషన్లు సాధించారని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలవబోతుందన్నారు. కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్లను సాధించుకుని వద్దామని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఇది బీజేపీకి పరీక్ష అని, అది వ్యాపారుల వైపా? బీసీల వైపా? అనేది తేలిపోతుందన్నారు.
Updated Date - Mar 18 , 2025 | 03:51 AM