BC Welfare: క్యాబినెట్ నిర్ణయం అభినందనీయం: జాజుల
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:06 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేయాలన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పంజాగుట్ట, జూలై 11(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేయాలన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేష్ చారి,పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ-ఏ కులాల అధ్యక్షుడు ఎం.భాగయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహే్షగౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, ఇతర క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్ను గౌరవించి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి.. గవర్నర్ ద్వారా ఏప్రిల్ 11న రాష్ట్రపతికి పంపించిందన్నారు. మూడు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని విమర్శించారు. బీసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల పెంపునకు అన్ని పార్టీలు సహకరించాలని, అడ్డుకోవాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాజకీయ పార్టీల వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ఆర్డినెన్స్ ఆమోదం తదితర విషయాలపై రెండు మూడు రోజుల్లో హైదరాబాద్లో మేధోమధన సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
Updated Date - Jul 12 , 2025 | 04:06 AM