గొర్రెల స్కామ్ కేసు నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN, Publish Date - May 03 , 2025 | 05:28 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గొర్రెల కుంభకోణంపై 2023 డిసెంబరులో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత.. కుమారుడు ఇక్రముద్దీన్తో కలిసి మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. తొలుత 2.10కోట్ల అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు కాగా.. తదుపరి విచారణలో ఇది రూ.700 కోట్ల కుంభకోణమని అధికారులు తేల్చారు.
అప్పట్లోనే వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా.. దుబాయ్ నుంచి మొయినుద్దీన్ను రప్పించడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు సెర్చ్ వారెంట్తో కోకాపేటలో ఉన్న మొయినుద్దీన్ ఇంటికి వెళ్లగా.. ఆయన భార్య అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు సెర్చ్ వారెంట్ చూపిన తర్వాత ఏసీబీ అధికారులను ఆమె అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మొయినుద్దీన్ భార్యకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం.
Updated Date - May 03 , 2025 | 05:28 AM