Surrogacy Scam Unfolds: కన్నవారం కాదని వారు వదిలేశారు.. కన్నవారేమో కటకటాల్లో!
ABN, Publish Date - Jul 31 , 2025 | 05:47 AM
ఆ శిశువును తమ బిడ్డే అనుకున్న ఆ తల్లిండ్రులు, తమ నెత్తురు పంచుకొని పుట్టిన బిడ్డ కాదని తెలుసుకొని వదిలేయడం..
అనాథగా శిశువిహార్లో 2నెలల బిడ్డ.. ఐదుగురి జీవితాలతో నమ్రత చెలగాటం
ఫర్టిలిటీ కేంద్రం సహాయకులు సంజయ్, నందిని పరారీలో
తన క్లినిక్ లైసెన్స్ రద్దవడంతో మరో డాక్టర్ పేరుతో నమ్రత లైసెన్స్
హైదరాబాద్ సిటీ, కేపీహెచ్బీకాలనీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఆ శిశువును తమ బిడ్డే అనుకున్న ఆ తల్లిండ్రులు, తమ నెత్తురు పంచుకొని పుట్టిన బిడ్డ కాదని తెలుసుకొని వదిలేయడం.. అటు బిడ్డకు కన్నవారుగా తేలిన ఆ జంటేమో కటకటాలపాలవ్వడంతో ఇప్పుడా రెండు నెలల పసిగుడ్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ఆ దంపతులకు.. ఇటు కన్నవారికి దూరమై ఆ బిడ్డ ఓ అనాథగా శిశువిహార్కు పరిమితమైంది. సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత.. ఇలా ఐదుగురి జీవితాలతో చెలగాటమాడింది. సరోగసీ ద్వారా బిడ్డను అందజేస్తామని రాజస్థాన్కు చెందిన దంపతులకు హామీ ఇచ్చిన నమ్రత.. అసోంకు చెందిన దంపతులు మహ్మద్ ఆలీ ఆదిక్, నస్రీమా బేగంకు పుట్టిన మగబిడ్డను వారి నుంచి రూ. 90 వేలకు కొని.. ఆ బిడ్డ సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డగా నమ్మించి పిల్లలు లేని దంపతులకు అంటగట్టింది. ప్రతిగా ఆ దంపతుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసింది. అయితే తమ బిడ్డే అని నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షల తాలుకు ధ్రువపత్రాలను నమ్రత ఇవ్వకపోవడంతో అనుమానించిన ఆ దంపతులు డీఎన్ఏ పరీక్షలు చేయించగా ఆ శిశువు తమ బిడ్డ కాదని తేలిపోయింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సృష్టి ఫర్టిలిటీలో జరుగుతున్న మోసాల గుట్టు బట్టబయలైంది. గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రతను, అమె కుమారుడు జయంత్ కృష్ణను, పుట్టిన బిడ్డను రూ.90వేలకు అమ్ముకున్న నస్రీమాబేగం, మహ్మద్ ఆలీ ఆదిక్లను నమ్రతకు సహకరించిన వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే కన్నతల్లిదండ్రులు దూరమై.. పెంచుకుంటున్న తల్లిదండ్రులూ వదిలేయడంతో శిశువిహార్కు చేరిన ఆ బిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కన్నవాళ్లు జైలు నుంచి బయటకొచ్చాక వారికి బాబును అప్పగిస్తారా? ఒకవేళ వారు నిరాకరిస్తే ఆ చిన్నారిని శిశువిహార్లోనే ఉంచుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. పుట్టిన వెంటనే పొత్తళ్లలోని బిడ్డను అమ్ముకున్న దంపతులకు ఆ బిడ్డను అప్పగించడానికి నిబంధనలు ఒప్పుకుంటాయా? అనేది తేలాల్సి ఉంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆ బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. నేడో రేపో నమ్రతతో పాటు.. ఆ బిడ్డ తల్లిదండ్రులను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది.
కేబీహెచ్బీలో 3 ఫర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు
కేపీహెచ్బీలోని 3 ఫర్టిలిటీ కేంద్రాలను బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ ఉమాగౌరి ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అవని, ఐశ్వర్య, ఫెర్టీ9 కేంద్రాలను పరిశీలించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఆయా కేంద్రాల్లో గుర్తించిన లోపాలపై సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇస్తామని డీఎంహెచ్వో తెలిపారు.
ఎంతమందికి బేబీలను ఇచ్చి ఉంటారు?
సృష్టి సరోగసీ మోసం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గోపాలపురం పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రత దందాలో ఇద్దరు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మోసాలపై ఐదేళ్లక్రితమే కేసులు నమోదయ్యాయి. సోదాలు చేసిన వైద్యాధికారులు, పోలీసులు ఈ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆమె లైసెన్స్ను రద్దుచేశారు. అప్పటికే ఆమె ఏపీలో, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బ్రాంచీల నుంచి సరోగసీ, టెస్ట్ట్యూబ్ బేబీ దందాను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్లో కేంద్రం మూతబడిన తర్వాత కొద్దివిరామం ఇచ్చిన నమ్రత మరో డాక్టర్ పేరుతో లైసెన్స్ పొందింది. అప్పటి నుంచి తనఇంటినే కేంద్రంగా మార్చేసి.. సంజయ్, నందిని అనే ఇద్దరిని సహాయకులుగా నియమించుకుంది. వారి ఆధ్వర్యంలో ఈ అక్రమ దందాను నమ్రత తిరిగి కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల సరోగసీ మోసం వెలుగులోకొచ్చాక సంజయ్, నందిని పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. వారు దొరికితే ఇప్పటి వరకు ఎంతమందికి టెస్ట్ట్యూబ్ బేబీలను అందించారు? సరోగసీ ద్వారా ఎంతమందికి సంతానాన్ని అందించారు? అనే వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News
Updated Date - Jul 31 , 2025 | 05:47 AM