గన్పార్క్లో అమర వీరులకు సీఎం రేవంత్ ఘన నివాళి
ABN, Publish Date - Sep 17 , 2025 | 02:16 PM
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ గన్పార్క్లోని అమర వీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు.
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ గన్పార్క్లోని అమర వీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ, సమానత్వంలో తెలంగాణ రోల్మోడల్ అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకోవాలంటే విద్యే మార్గమమని చెప్పారు. గొప్ప లక్ష్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్కి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీ పెట్టుబడి పెట్టామన్నారు. విద్యతో పాటు క్రీడలకు సైతం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులుగా చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పారు. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తున్నామన్నారు. త్వరలో విద్యా పాలసీ తీసుకొస్తామని స్పష్టం చేశారు.
రుణమాఫీ ద్వారా రైతులకు విముక్తి కల్పించామని గుర్తు చేశారు. రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. రైతుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేదని సీఎం రేవంత్ కుండ స్పష్టం చేశారు. రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 17 , 2025 | 02:26 PM