NRI: వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!
ABN, Publish Date - Oct 21 , 2025 | 05:59 PM
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) ఆధ్వర్యంలో వార్సా నగరంలో అక్టోబర్ 18న ఈ దివ్య మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు, స్థానిక ఎన్నారైలు హాజరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ నేలపై తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, పోలాండ్ రాజధాని వార్సాలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) ఆధ్వర్యంలో అక్టోబర్ 18న ఈ దివ్య మహోత్సవం జరిగింది. టీటీడీ ఏఈఓ మల్లయ్య పర్యవేక్షణలో టీటీడీ (TTD) అర్చక బృందం వేద ఆచారాలతో, శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ క్రతువును నిర్వహించింది. వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు, పుష్ప అలంకరణలతో వేదిక మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం (Indian Embassy, Warsaw) నుంచి ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై శ్రీవారి దివ్య ఆశీస్సులను పొందారు. విదేశీ నేలపై భారతీయ సంస్కృతికి లభించిన ఈ గౌరవం అందరినీ ఆనందభరితులను చేసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు పులకించిపోయారు. తిరుమలలో జరిగే విధంగా అర్చకులు కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా తీర్చిదిద్దారు. వేదిక మొత్తం ‘గోవిందా… గోవిందా’ నినాదాలతో మారుమోగింది. కళ్యాణ మహోత్సవంతో పాటు వేద పారాయణం, సాంప్రదాయ అలంకరణలతో ఈ వేడుక ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన పండుగ వాతావరణాన్ని సృష్టించింది.
ఈ సంవత్సరం శ్రీనివాస కళ్యాణం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను శాశ్వతంగా పోలాండ్కు తీసుకొచ్చారు. ఇది పోలాండ్ భక్తులకు ఆధ్యాత్మికంగా ఒక కొత్త యుగానికి నాంది పలికింది. ఇకపై స్వామివారి నిత్యారాధనలు, పూజలు, ఉత్సవాలు స్థానికంగా జరిగేలా ఏర్పాట్లు చేయడం పోలాండ్ తెలుగు అసోసియేషన్ మహత్తర సాధనగా నిలిచింది.
ఈ పవిత్ర వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ ఇతర భారతీయ రాష్ట్రాల భక్తులతో పాటు అనేక విదేశీ భక్తులు కూడా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. అనంతరం భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం కళ్యాణ ప్రసాదం పంపిణీ చేశారు.
PoTA అధ్యక్షులు చంద్రభాను మాట్లాడుతూ, పోలాండ్లో నివసిస్తున్న భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం తమ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) బృందం అంకితభావం, సమిష్టి కృషి ఫలితంగా ఈ కార్యక్రమం విజయవంతమైంది. సంస్థ వ్యవస్థాపకులు హరి చంద్ కాట్రగడ్డ, చంద్రభాను ఆక్కల నాయకత్వంలో, వైస్ ప్రెసిడెంట్ సురేష్ పెరుమాళ్ళ, జనరల్ సెక్రటరీ శైలేందర్ గంగుల సమన్వయంతో ఈ మహోత్సవం ఘనవిజయాన్ని సాధించింది. కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన బాపిరాజు దుమంతరావు, కుప్పిలి రామకృష్ణ, సందీప్ శ్రీనాధుని, సుబ్బిరామిరెడ్డి బైరెడ్డి, సంజీవ్ కుమార్ గాదేపల్లి, కందుల రామ్మోహన్, కందుల తేజ, కందూరి శరత్ చంద్ర, ఆళ్ల పృథ్వి, కాట్రగడ్డ విజయకుమార్, సంపత్ కుమార్ మద్దుల అలాగే SHE టీమ్ కోర్ కమిటీ సభ్యులు స్వాతి అక్కల, విశ్వశాంతి గాదేపల్లి, శ్రీదేవి మద్భవి, నిహారిక గుండ్రెడ్డి, లక్ష్మీ దుమంతరావు, ఆషా పెరుమాళ్ళ, అను శ్రీనాధుని, కందుల సరోజిని, అపూర్వ కొత్తూరి, కిరణ్మయి బాడినేడి వారి సమిష్టి కృషితో పోలాండ్లో తిరుమల వైభవం సజీవమైంది.
యూరప్ ప్రధాన కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని సారథ్యంలో డాక్టర్ శ్రీకాంత్ సుమంత్ కొర్రపాటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విజయవంతంగా సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. “గోవిందా… గోవిందా!” నినాదాలతో ముగిసిన ఈ దివ్య వేడుక భక్తుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్ర గానాలహరి.. ఓలలాడిన అభిమానులు
హాంబర్గ్లో ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం
Updated Date - Oct 21 , 2025 | 06:29 PM