Sankara Nethralaya చికాగో చాప్టర్ ఆధ్వర్యంలో కంటి సమస్యలపై అవగాహన కార్యక్రమం
ABN, Publish Date - Dec 22 , 2025 | 11:11 PM
కంటి సంరక్షణా, వైద్య సేవా కార్యక్రమాల గురించి సమాజంలో అవగాహన పెంచడానికి శంకర నేత్రాలయ చికాగో చాప్టర్ డిసెంబర్13న అరోరా ప్రాంతంలో ఒక చలనచిత్ర సంగీత కచేరీని నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్: గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలోని నిరుపేద రోగుల కంటి సంరక్షణా, వైద్య సేవా కార్యక్రమాల గురించి సమాజంలో అవగాహన పెంచడానికి శంకర నేత్రాలయ చికాగో చాప్టర్ డిసెంబర్13న అరోరా ప్రాంతంలో ఒక చలనచిత్ర సంగీత కచేరీని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రతిభావంతులైన నృత్య కళాకారులు ఉల్లాసమైన, ఉత్సాహభరితమైన శాస్త్రీయ, చలనచిత్ర నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. చికాగోకు చెందిన ప్రముఖ గాయకులు ప్రవీణ్ కుమార్ జాలిగమ, మణి తెల్లా ప్రగడ, పరిమళా ప్రసాద్లు, తమ చక్కని గానంతో ప్రేక్షకులని అలరించారు. ఆ తరువాత, ప్రముఖ సినీ గాయకులు పార్థు, మల్లికార్జున్, సుమంగళి తమ అద్భుత సినీ గాన ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తమ చక్కని, వైవిధ్యభరితమైన పాటలతో, ముఖ్యంగా మల్లికార్జున్ తన డ్యాన్సుతో అలరించిన విధానం, గ్రాండ్ ఫినాలేగా పార్థు 'వేదం .. అణువణువునా నాదం' పాటతో సభను సమ్మోహితులను చేశారంటే అతిశయోక్తి కాదు. అత్యంత కఠినమైన చలిని కూడా లెక్కచేయకుండా తరలి వచ్చిన ప్రేక్షకులు మైమరచిపోయేలా, సమయం కూడా మరచిపోయేలా ఈ సినీ గాన విభావరి సాగింది. దీనికి తోడు ప్రణతి, హరీషాల యాంకరింగ్ ఆద్యంతమూ ప్రేక్షకులని ఆకట్టుకునేలా కొనసాగింది.
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, చికాగో చాప్టర్ ట్రస్టీలు పవన్ నారం రెడ్డి, గౌరి అద్దంకి చేసిన ప్రసంగాలు సాధారణ కంటి పరీక్షలు, అధునాతన శస్త్ర చికిత్సలు, నివారణ కంటి సంరక్షణల ప్రాముఖ్యతను హైలైట్ చేశాయి. అలాగే శంకర నేత్రాలయ USA నాయకత్వ బృందం నుండి బాలా ఇందుర్తి, మూర్తి రాకేపల్లి, బ్రాండ్ అంబాసిడర్ ప్రసాద్ రెడ్డి కటంరెడ్డి భారతదేశం అంతటా శంకర నేత్రాలయ చేస్తున్న పరివర్తనాత్మక పనిని కూడా వివరించారు.
శంకర నేత్రాలయ USA నాయకత్వ బృందం నుండి ప్రెసిడెంటు బాల రెడ్డి ఇందుర్తి, కోశాధికారి మూర్తి రేకపల్లి, బ్రాండ్ అంబాసిడర్ ప్రసాద్ రెడ్డి కటంరెడ్డి వంటి విశిష్ట
అతిథులు హాజరయ్యారు. భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం నుండి ప్రతినిధులు లిమా మ్యాతీవ్, మిల్వాకి చాప్టర్ ప్రతినిధులు చంద్ర మౌళి, జగదీశ్, అరోరా నగర కౌన్సిల్ సభ్యురాలు శ్వేతా బైద్, అనేక మంది ప్రముఖ స్థానిక ప్రముఖులతో సభ కళకళలాడింది.
చికాగో ట్రస్టీల నాయకత్వంలో చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ హిమ, బృంద సభ్యులు శ్రీహరి జాస్తి, కిరణ్ మాట్టే, మోహన్ పరుచూరి, రాధికా గరిమెళ్ళ, తమిశ్రా కొంచాడ, రామ్ ప్రసాద్, మాలతీ దామరాజు, శ్రీహరి జాస్తి, శ్వేతా కొత్తపల్లి, బిందు, రాధా వీరపనేని, శైలజ సప్ప, శివ, రామకృష్ణ తాడేపల్లి, నరేశ్ సేవా స్ఫూర్తి స్థానిక సమాజాన్ని ఒక చోటకు చేర్చింది.
ఈ కార్యక్రమం యునైటెడ్ స్టేట్స్లోని NRI సమాజం దాతృత్వాన్ని, జన్మ భూమి పట్ల వారి ప్రబలమైన బాధ్యతను ప్రతిబింబించింది. అతి భయంకరమైన గడ్డు చలిలో కూడా భారతీయ సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని, మద్దతును అందించింది. తత్ఫలితంగా చికాగో చాప్టర్ తరఫున 3 MSU (Mobile Surgical Units) లకు స్పాన్సర్ చేసేందుకు దాతలు ముందుకు వచ్చారు. దీని ద్వారా కనీసం 3 గ్రామాల ప్రజలు లభ్ది పొందుతాతారని అంచనా. ఇందుకు గాను శంకర నేత్రాలయ చికాగో చాప్టర్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. మేసు అడాప్ట్-ఎ-విలేజ్ (అంధత్వ నివారణ కై గ్రామాలను దత్తత తీసుకున్న) రవి వీరపనేని, శివ గాడెపల్లి, పద్మ రావ్, సునీతను స్థానిక ట్రస్టీల సమక్షంలో ప్రసాద్ రెడ్డి, బాల ఇందుర్తి సత్కరించారు.
ఇంతే కాకుండా, నివారించగల అంధత్వాన్ని తొలగించడం అనే శంకర నేత్రాలయ సదాశయానికి మద్దతుగా స్ఫూర్తి పొందిన పలువురు కూడా తమ ధనాన్ని, సమయాన్ని దానం చేయటానికి ముందుకు రావటం ఈ కార్యక్రమానికి ఘన విజయమని చెప్పొచ్చు. శంకర నేత్రాలయ గురించి మరింత సమాచారం కోసం www.sankaranethralaya.org ను సందర్శించొచ్చు.
తానా ఆధ్వర్యంలో ఛార్లెట్లో ఫుడ్ డ్రైవ్.. సక్సెస్
సుందర్ పిచాయ్తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ
Updated Date - Dec 27 , 2025 | 10:14 PM