TANA: ఛార్లెట్లో ధీమ్ తానా పోటీలు విజయవంతం
ABN, Publish Date - Jun 17 , 2025 | 08:24 AM
TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో జరిగిన ఛార్లెట్లో ధీమ్ తానా పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో దాదాపు 255 మంది పాల్గొని వివిధ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విజేతలు తానా మహాసభల వేదికపై జరిగే ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు.
Charlotte: ఉత్తర అమెరికా (North America) తెలుగు సంఘం (Telugu Association) (తానా) ద్వైవార్షిక మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో జరిగాయి. ఈ సందర్భంగా వివిధ నగరాల్లో ధీమ్ తానా పోటీలను (Dheem TANA competitions) నిర్వహించింది. ఇందులో భాగంగా ఛార్లెట్లో నిర్వహించిన ధీమ్ తానా పోటీలకు మంచి స్పందన వచ్చింది. దాదాపు 14 గంటలపాటు జరిగిన ఈ పోటీల్లో ఎంతోమంది పాల్గొన్నారు. మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా, చిలక గోరింక, సోలో సింగింగ్, గ్రూపు డ్యాన్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. దాదాపు 255 మంది ఇందులో పాల్గొని వివిధ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విజేతలు తానా మహాసభల వేదికపై జరిగే ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. అద్భుతమైన కార్యక్రమాలతో, అంకితభావంతో 60 మందితో కూడిన వాలంటీర్లు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ పోటీలను తిలకించేందుకు 1200 మందికిపైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.
ఫాదర్స్ డే వేడుకలు..
ఈ కార్యక్రమాల్లోనే ఫాదర్స్ డే వేడుకలను కూడా వైభవంగా నిర్వహించారు. మూడుతరాల వారు వేదికపై మాట్లాడారు. అలాగే కేకును కట్ చేశారు. ఈ వేడుకల్లో తాత, తండ్రి, మనవళ్ళు కలిసి పాల్గొని కార్యక్రమానికి నిండుదనం తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి యాంకర్, ఎంసిగా ఝాన్సీ అబ్బూరి వ్యవహరించారు. మిస్ యూనివర్స్ ఇండియా యుఎస్ ఎ 2024 అమెలియా మల్లారెడ్డితోపాటు క్లాసికల్ డ్యాన్సర్ సాయి మౌనిక సజ్జ, న్యూఇంగ్లాండ్ ఆర్ ఆర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి తదితరులు పాల్గొన్నారు.
తానా 24వ మహాసభలు..
ఈ కార్యక్రమాలకు వచ్చిన వారి కోసం నిర్వాహకులు రాఫిల్స్, షాపింగ్, ఫేస్ పెయింటింగ్, హెన్నా, మెహందీ వంటివి ఏర్పాటు చేశారు. రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, డిట్రాయిట్ నగరంలోని నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్లో జరగనున్న తానా 24వ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. రాజకీయ నాయకులతోపాటు, సినిమా హీరోలు, హీరోయిన్లు, సంగీత దర్శకులు, నేపథ్యగాయనీ గాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సాహితీ వేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందినవారందరినీ ఒకే వేదికపై చూసే అవకాశం ఈ మహాసభల ద్వారా లభిస్తోందన్నారు. ఛార్లెట్, ఇతర చుట్టుప్రక్కల ఉన్న తెలుగువాళ్ళంతా కుటుంబ సమేతంగా ఈ మహాసభలకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో ఛార్లెట్ రాలీలో ఉన్న పలువురు తానా నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, రాజేష్ యార్లగడ్డ, రవి వడ్లమూడి, మాధురి ఏలూరి, నిత్య గింజుపల్లి, హరిణి వరదరాజన్, హేమ దాసరి, శ్రీదేవి సుంకర, పట్టాభి కంఠంనేని, రమణ అన్నే తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమ విజయవంతం కావటానికి రమేష్ మూకుళ్ల, ప్రశాంత్ బొక్క, జానకి గోల్వి సహకరించారు.
ఇవి కూడా చదవండి:
రైల్వేలో 6,374 పోస్టుల భర్తీకి చర్యలు
For More AP News and Telugu News
Updated Date - Jun 17 , 2025 | 08:24 AM