Excessive Consumption of Carbohydrates: అధిక పిండిపదార్థాలే శత్రువులు
ABN, Publish Date - Oct 14 , 2025 | 06:12 AM
భారతీయులు పిండిపదార్థాల ప్రియులు. మనకు అన్నం లేదా రోటీ లేనిదే ఆకలి తీరదు. ఇలాంటి అధిక పిండిపదార్థాల ఆహార శైలి వల్లే ఊబకాయం, మధుమేహ సమస్యలు పెరుగుతున్నాయని తాజా...
అధ్యయనం
భారతీయులు పిండిపదార్థాల ప్రియులు. మనకు అన్నం లేదా రోటీ లేనిదే ఆకలి తీరదు. ఇలాంటి అధిక పిండిపదార్థాల ఆహార శైలి వల్లే ఊబకాయం, మధుమేహ సమస్యలు పెరుగుతున్నాయని తాజా ఐసిఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనం హెచ్చరిస్తోంది. మరిన్ని వివరాలు...
పిండిపదార్థాలు కచ్చితంగా శక్తి భాండాగారాలే! అయితే భారతీయుల ఆహారంలో రోజువారీ 62ు క్యాలరీలు పిండిపదార్థాల నుంచే అందుతున్నాయి. మరీ ముఖ్యంగా తెల్ల అన్నం, అదనపు చక్కెరల నుంచే ఈ పిండిపదార్థాలు సమకూరుతూ ఉండడం మరింత ఆందోళనకరమైన విషయం. దక్షిణ భారతదేశంలో తెల్ల అన్నం ప్రధాన పిండిపదార్థ వనరు అయితే, తూర్పు, ఈశాన్య భారతదేశంలో గోధుమలు ప్రధాన పిండిపదార్థ వనరుగా ఉపయోగపడుతున్నాయి. దేశంలోని 21 రాష్ట్రాలు, సూచించిన చక్కెర మోతాదులను మించిపోయాయి. పిండిపదార్థాలతో ఊబకాయం, మధుమేహ ముప్పు పొంచి ఉంది కాబట్టి మన కంచాల్లో నుంచి అన్నం, రోటీలను పూర్తిగా తొలగించుకోవాలా? అంటే, అవసరం లేదు. వాటి పరిమాణాన్ని 5ు తగ్గించుకుంటే సరిపోతుందని అంటున్నారు సీనియర్ డయాబెటాలజిస్ట్, అధ్యయనం తొలి రచయిత్రి, డాక్టర్ అంజన. ఐదు శాతం పిండిపదార్థాల కోతతో మధుమేహానికీ, ప్రిడయాబెటి్సకూ అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారామె. ఉదయం అల్పాహారంలో రెండు ఇడ్లీలు తినే అలవాటున్నవారు, ఒక ఇడ్లీని తొలగించి, దాని స్థానాన్ని సాంబారుతో భర్తీ చేసుకోవచ్చు. ఒక పూరీ స్థానాన్ని ఒక కప్పు పప్పుతో, రాజ్మాతో భర్తీ చేసుకోవచ్చు. అలాగే కప్పు పెరుగు, గుడ్డుతో బ్రేక్ఫా్స్టను పరిపూర్ణం చేసుకోవచ్చని సూచిస్తున్నారామె.
అన్నం, రోటీ ఒకటే!
సాధారణంగా అన్నం తగ్గించాలనుకునేవారు ఆ లోటును రోటీతో భర్తీ చేస్తూ ఉంటారు. కానీ అన్నం, రోటీ... రెండూ పిండిపదార్థాలే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ సమానంగా ఉంటుంది. పిండిపదార్థాలు త్వరగా జీర్ణమై, శరీరం వాటిని త్వరగా ప్రాసెస్ చేసుకుంటుంది. దాంతో శరీరంలో చక్కెర మోతాదులు పెరిగి, వెంట వెంటనే ఆకలేస్తుంది. ఇదే క్రమం కొనసాగుతూ, శరీరంలోకి చేరుకునే అదనపు క్యాలరీల వల్ల ఊబకాయం, మధుమేహం తలెత్తుతాయి. కాబట్టి పిండిపదార్థాల మోతాదును తగ్గించుకోవడం ఉత్తమం.
చిరుధాన్యాలు తినొచ్చా?
రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, సామలు... ఇలా అనేక చిరుధాన్యాల పట్ల ఇటీవలి కాలంలో మక్కువ పెరిగింది. అయితే వీటిలో పీచు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న చిరుధాన్యాలన్నీ పాలిష్ పట్టినవేననే విషయం గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ సుధా వాసుదేవన్. వీటిని తినడం వల్ల, శుద్ధి చేసిన బియ్యానికి రెండు రెట్లు ఎక్కువగా చక్కెర మోతాదులు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారామె. నిల్వ సామర్ధ్యాన్ని పెంచడం కోసం చిరుధాన్యాలను శుద్ధి చేయడం వల్ల పోషకభరితమైన పొరలన్నీ తొలగిపోతున్నాయ(ని అంటున్నారు సుధ. చిరుధాన్యాలు జీర్ణమయ్యే సమయాన్ని పెంచడం కోసం వాటిని కూరగాయలు, చిక్కుళ్లు, పప్పుధాన్యాలతో కలిపి వండుకోవాలని సూచిస్తున్నారామె.
మాంసకృత్తులను పెంచి...
పిండిపదార్థాలను తగ్గించడంతో పాటు మాంసకృత్తులను పెంచడం మీద కూడా దృష్టి పెట్టాలి. మన దేశంలో ఒక రోజుకు తీసుకుంటున్న సగటు మాంసకృత్తులతో అందుతున్న క్యాలరీల సంఖ్య 12 శాతం మాత్రమే! కానీ రోజు మొత్తంలో మన శరీరానికి అందవలసిన మొత్తం క్యాలరీల్లో 50 శాతం క్యాలరీలు మాత్రమే పిండిపదార్థాల నుంచి, 20 నుంచి 30 శాతం క్యాలరీలు కొవ్వుల నుంచి, 20 శాతం క్యాలరీలు మాంసకృత్తుల నుంచి, 3 నుంచి 6 శాతం క్యాలరీలు పీచు నుంచి అందేలా చూసుకోవాలి. నిజానికి మాంసకృత్తులను కలిగిన పదార్థాలన్నీ ఖరీదైనవే! కాబట్టి పిండిపదార్థాల మోతాదు పెరుగుతోంది. అయితే ఇలాంటి పరిస్థితిలో పిండిపదార్థాల ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం ‘ఫాస్ట్ కార్బ్స్’ను పరిమితం చేసుకోవాలి. అందుకోసం వైట్ బ్రెడ్, పాలిష్ పట్టిన ధాన్యాలను తగ్గించి, నెమ్మదిగా జీర్ణమయ్యే బీన్స్, చిక్కుళ్లు, నట్స్, పండ్లు తీసుకోవాలి. శాకాహారులు వృక్షాధారిత మాంసకృత్తులు మీద దృష్టి పెట్టాలి. ప్రతి భోజనంలో పులిసిన పాల ఉత్పత్తులకు చోటు కల్పించాలి. మాంసాహారులు రోజులో ఒక్క పూటైనా చేపలు, గుడ్లు తినాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 14 , 2025 | 06:12 AM