Supreme Court Slams Rahul Gandhi : నిజమైన భారతీయుడు అలా మాట్లాడడు!
ABN, Publish Date - Aug 05 , 2025 | 03:55 AM
చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని.. అరుణాచల్ ప్రదేశ్లో భారత జవాన్లను కొడుతోందని వ్యాఖ్యలు
రాహుల్ చైనా వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
ఆ దేశం 2000 చ.కి.మీ.ల మన భూభాగాన్ని ఆక్రమించిందని మీకెలా తెలుసు?
మీరు అక్కడ ఉన్నారా? అంటూ నిలదీత
రాహుల్ మెరుగ్గా మాట్లాడాల్సిందని న్యాయవాది సింఘ్వీ అంగీకారం
పరువు నష్టం కేసులో రాహుల్కు ఊరట
లఖ్నవూ కోర్టులో విచారణపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ, ఆగస్టు 4: చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని.. అరుణాచల్ ప్రదేశ్లో భారత జవాన్లను కొడుతోందని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన నిజంగా భారతీయుడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టంచేసింది. గల్వాన్ లోయలో 2020 జూన్లో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా భూభాగాన్ని ఆక్రమించుకుందని, ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం చైనాకు లొంగిపోయారని 2022 డిసెంబరులో ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ విమర్శించారు. ఆయన భారత సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారంటూ లఖ్నవూ ప్రత్యేక కోర్టులో ఉదయ్శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసులో తమ ముందు హాజరు కావాలని కోర్టు రాహుల్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో సమన్లు జారీచేసింది. దీనిని ఆయన అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన వ్యాజ్యాన్ని న్యాయస్థానం మే 29న కొట్టివేసింది. ఆర్మీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడే హక్కు వాక్స్వాతంత్య్రం కిందకు రాదని.. కోర్టు ముందు ఆయన హాజరు కావలసిందేనని స్పష్టంచేసింది. దీంతో తనపై కేసును రద్దుచేయాలంటూ ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ వేశారు. ఇది సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీ్హతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ దత్తా రాహుల్ తీరుపై కటువైన వ్యాఖ్యలు చేశారు. ‘చైనా మన భూభాగంలో 2 వేల చదరపు కిలోమీటర్లు ఆక్రమించిందని మీకెలా తెలుసు? మీరు అక్కడ ఉన్నారా? విశ్వసనీయ ఆధారాలేమైనా మీ వద్ద ఉన్నాయా? పార్లమెంటులో మాట్లాడకుండా సోషల్ మీడియాలో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు?
ఎలాంటి ఆధారాల్లేకుండా ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తారు’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. నిజమైన భారతీయుడైతే ఇలా మాట్లాడరని స్పష్టం చేశారు. వీటిపై మీడియాలో ప్రచురించేలా ఇలా మాట్లాడకుంటే ఆయన ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టును ప్రశ్నించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సరిహద్దుల్లో సంక్షోభం జరుగుతుంటే ఇరువైపులా ప్రాణనష్టం జరుగడం అసాధారణం కాదని గుర్తుచేసింది. అయితే నిజమైన భారతీయులు కూడా మన జవాన్లను కొట్టి చంపారనే అంటారని సింఘ్వీ అన్నారు. ప్రభుత్వం సరైన వివరాలు చెప్పాలన్నదే రాహుల్ అభిమతమని.. సమాచారాన్ని అణచివేయడాన్నే ఆయన లేవనెత్తుతున్నారని తెలిపారు. జస్టిస్ దత్తా జోక్యం చేసుకుని.. బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా రాహుల్ ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తగు వేదికలు ఉంటాయని.. వీటిపై ఆయన పార్లమెంటులో ఎందుకు మాట్లాడరని జస్టిస్ దత్తా నిలదీశారు. రాహుల్ మరింత మెరుగ్గా వ్యాఖ్యలు చేసి ఉండాల్సిందని సింఘ్వీ అంగీకరించారు. అయితే ఆయనపై ఫిర్యాదు చేయడం.. ఆయన్ను వేధించడానికి చేసిన ప్రయత్నమని చెప్పారు. క్రిమినల్ ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోదలిస్తే.. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎ్సఎస్) సెక్షన్ 223 ప్రకారం.. నిందితుడి వాదనలు కూడా వినాలని.. ఈ కేసులో అలా జరుగలేదని తెలిపారు. దీంతో రాహుల్పై లఖ్నవూ కోర్టులో విచారణపై ధర్మాసనం స్టే విధించింది. కేసును కొట్టివేయాలన్న ఆయన అభ్యర్థనపై యూపీ ప్రభుత్వానికి, పరువునష్టం దావా వేసిన ఉదయ్శంకర్ శ్రీవాస్తవకు నోటీసులు జారీచేసింది. 3 వారాల్లో జవాబివ్వాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 03:55 AM