Chhangur Baba: చంగూర్ బాబా రెడ్ డైరీలో పలువురు పొలిటీషియన్ల పేర్లు
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:45 PM
ఏటీఎస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ప్రస్తుతం ఈ రెడ్ డైరీపై దృష్టి సారించాయి. చంగూర్ బాబా 'ఫారెన్-ఫండెడ్ ఎంపైర్' రూ.106 కోట్ల మేరకు విస్తరించినట్టు ఈ డైరీలో సాక్ష్యాలున్నాయి.
లక్నో: మత మార్పిడులు, ఉగ్రనిధుల ఆరోపణలను ఎదుర్కొంటున్న జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా (Chhangur Baba) లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏజెన్సీల దర్యాప్తులో వెలుగు చూసిన 'రెడ్ డైరీ'లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ ప్రకారం విదేశాల నుంచి రూ.106 కోట్ల ఫండింగ్ ఆయన అందుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ టెర్రరిస్టు నిరోధక స్క్వాడ్ (ATS) దాడుల్లో చంగూర్ విలాసవంతమైన భవంతిలో ఈ డైరీ దొరికినట్టు చెబుతున్నారు. అందులో పలువురు రాజకీయ నేతలు, మాజీ అధికారుల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. 2022 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి చంగూర్ బాబా ఆర్థికసాయం అందించారని సమాచారం.
ఏటీఎస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ప్రస్తుతం ఈ రెడ్ డైరీపై దృష్టి సారించాయి. చంగూర్ బాబా 'ఫారెన్-ఫండెడ్ ఎంపైర్' రూ.106 కోట్ల మేరకు విస్తరించినట్టు ఈ డైరీలో సాక్ష్యాలున్నాయి.
ఉంగరాలు అమ్ముకునే స్థాయి నుంచి..
చంగూర్ బాబాగా, పీర్ బాబాగా పేరున్న జమాలుద్దీన్.. నేపాల్ సరిహద్దు జిల్లా అయిన బలరాంపూర్లోని రెహ్రా మఫి గ్రామానికి చెందిన వాడు. సైకిల్పై ఉంగరాలు, రంగురాళ్లు అమ్ముకునేవాడు. పదేళ్లలోనే కోట్లాది రూపాయలకు అనూహ్యంగా పడగలెత్తాడు. మధ్యప్రాశ్చ దేశాల నుంచి విరాళాలు అందుతుండేవి. 40కి పైగా బ్యాంకు అకౌంట్ల ద్వారా సుమారు రూ.106కోట్ల లావాదేవీలు సాగించాడు. రెండు కీలక ప్రాపర్టీలు కూడా ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఒకటి బలరాంపూర్లో, మరొకటి మహారాష్ట్రలోని లోనవాలాలో ఉన్నాయి. వీటి విలువ రూ.18 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. లోనావాలాలో ఆస్తిని ఆగస్టు 2023లో కొనుగోలు చేశాడు. దీనిని తన పేరున, తన అసోసియేట్ పేరున సంయుక్తంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈడీ అధికారుల సమాచారం ప్రకారం, మహ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి లోనావాలాలోని భూమిని చంగూర్ బాబాకు అమ్మాడు. ఇదే పేరుతో ఉన్న వ్యక్తి బాబా అంకౌంట్లోకి నిధులు పంపినట్టు కూడా అనుమానిస్తున్నారు.
రాజకీయ నేతలతో సంబంధాలు
చంగూర్ బాబా పెంచి పోషించిన రాజకీయ నేతల సమాచారంపైనా దర్యాప్తు సంస్థలు కూపీ లాగుతున్నాయి. సుమారు అరడజను మంది రాజకీయ నేతలు బాబా నుంచి గణనీయంగా సొమ్మును అందుకున్నట్టు రెడ్ డెయిరీలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఉతరౌలా నియోజకవర్గం మాజీ అభ్యర్థికి రూ.90 లక్షలు పేమెంట్ చేసినట్టు డైరీలోని ఒక ఎంట్రీలో కనిపిస్తోంది. ఆ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బాబా 2027లో ఒక మాజీ ఐపీఎస్ అధికారిని అదే సీటులో నిలబెట్టాలని ప్లాన్ చేసిన్టటు కూడా తెలుస్తోంది. ఏళ్ల తరబడి బలరాంపూర్, పొరుగు నియోజకవర్గాల్లో రాజకీయ నాయకుల ప్రచారానికి అవసరమైన వనరులను బాబా సమకూర్చినట్టు చెబుతున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బాబా చురుకుగా వ్యవహరించారని, అభ్యర్థులకు నిధులు సమకూర్చారని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి 2003లో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతిఖ్ అహ్మద్తో చంగూర్ బాబా కలిసి ఉన్న అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విదేశీ నిధులు, మతమార్పిడులు
చంగూర్ బాబా, నీతు అలియాస్ నస్రీన్లను జులై 5న లక్నోలోని ఓ హోటల్లో అరెస్టు చేశారు. ప్రధానంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు, వితంతువులు, రోజువారీ కార్మికులు, షెడ్యూల్డ్ కులాల వారిని ప్రలోభ పెట్టి, బెదిరించి, డబ్బులు ఎర చూపించి, వివాహాలు జరిపిస్తామని హామీలిచ్చి లోబరుచుకునే వారని, మతమార్పిడులకు పాల్పడేవారని బాబాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇంతకుముందు బలరాంపూర్లో ఎస్టీఎఫ్ కేసు రిజిస్టర్ చేసింది. అనంతరం జులై 9న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. జులై 17న 14 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిపింది. వీటిలో ఉతరౌలాలో 12 చోట్ల, ముంబైలో 2 చోట్ల దాడులు జరిగాయి. స్థానిక యంత్రాంగం సైతం బాబా స్వగ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని మధుపూర్ గ్రామంలో అక్రమంగా నిర్మించిన క్లాంప్లెక్స్ లోని కొంతభాగాన్ని ఇటీవల కూల్చేసింది. ఇది ప్రభుత్వ భూమి అని, 15 సీసీటీవీ కెమెరాలతో నిఘా, రెండు కావలి కుక్కలున్న ఈ బిల్డింగ్ చాలాకాలంగా అనుమానాస్పదంగా ఉన్నట్టు అధికారిక డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్ జనాభాకు మించి బిహార్కు ఇళ్లిచ్చాం: మోదీ
అధికారికంగా గుడ్బై.. ఇండియా కూటమికి ఆప్ షాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 06:18 PM