CP Radhakrihnan: మోదీని కలిసిన ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్
ABN, Publish Date - Aug 18 , 2025 | 05:59 PM
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఈనెల 20న రాధాకృష్ణన్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మంగళవారంనాడు జరిగే ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయనను సన్మానించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే (NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radha Krishnan) .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని సోమవారంనాడు కలుసుకున్నారు. ఎన్డీయే సమావేశాల్లో పాల్గొనేందుకు, పలువురు నేతలను కలుసుకునేందుకు రాధాకృష్ణన్ ఢిల్లీకి వచ్చారు.
అభినందలు తెలిపిన మోదీ
రాధాకృష్ణన్తో భేటీ అనంతరం మోదీ ఆ వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. 'రాధాకృష్ణన్ను కలుసుకున్నాను. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనకు నా అభినందనలు తెలియజేశాను. సుదీర్ఘ ప్రజా సేవ, అనుభవంతో ఆయన దేశ కీర్తిని పెంచారు. అదే అంకితభావంతో దేశానికి సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను' అని ఆ ట్వీట్లో మోదీ పేర్కొన్నారు.
20న నామినేషన్
కాగా, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఈనెల 20న రాధాకృష్ణన్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మంగళవారంనాడు జరిగే ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయనను సన్మానించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆదివారంనాడు జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమవేశానంతరం రాధాకృష్ణ పేరును సమావేశంలో ఎంపిక చేసినట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఏకగ్రీవంగా ఆయనకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరారు. గత వారం రోజులుగా విపక్ష నేతలతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, తిరిగి వారిని కలుస్తారని చెప్పారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఈనెల 21వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి..
రాధాకృష్ణన్ ఎంపిక వెనుక ఎన్డీయే వ్యూహం ఇదే
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివకు ఛాన్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 18 , 2025 | 06:02 PM