Pakistani Newlywed Couple: థార్ ఎడారిలో.. దాహంతో అలమటించి హిందూ యువ జంట మృతి
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:32 AM
పదిహేడేళ్ల రవికుమార్.. పదిహేనేళ్ల శాంతి బాయి.. పాకిస్థాన్కు చెందిన హిందువులు! వారికి ఈ మధ్యే సింధ్ ప్రావిన్సులోని మీర్పూర్లో పెళ్లయింది! ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్లో బతకలేం అనుకున్నారో.
జైసల్మేర్, జూన్ 30: పదిహేడేళ్ల రవికుమార్.. పదిహేనేళ్ల శాంతి బాయి.. పాకిస్థాన్కు చెందిన హిందువులు! వారికి ఈ మధ్యే సింధ్ ప్రావిన్సులోని మీర్పూర్లో పెళ్లయింది! ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్లో బతకలేం అనుకున్నారో.. ఇంకే కష్టం వచ్చిందో.. ఆ యువ దంపతులు భారతదేశానికి వచ్చి స్థిరపడాలనుకున్నారు. అందుకు అవసరమైన వీసాల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ.. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో అక్రమంగానైనా భారత్లోకి ప్రవేశించాలనుకు థార్ ఎడారి బాట పట్టారు. దాహానికి తాళలేక.. ఎడారి మధ్యలోనే.. ప్రాణాలు కోల్పోయారు!! ఆ జంట నీటి కోసం ఎంత అలమటించిందో చెప్పడానికి.. ఎడారిలో పడి ఉన్న రవికుమార్ ముఖం మీద ఉన్న ఖాళీ నీటి డబ్బానే నిదర్శనం! ఆ జంట అసువులు బాసిన ఐదారు రోజుల తర్వాత.. శనివారంనాడు స్థానిక పశువుల కాపరులు గుర్తించి సరిహద్దు భద్రతా దళాలకు సమాచారం అందించారు.
గుర్తింపు కార్డుల ఆధారంగా వారి సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు. ఇద్దరూ పాకిస్థాన్లోని సింధ్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. వారి వద్ద పాకిస్థానీ సిమ్ కార్డు ఉందని.. నవ వధువులు ధరించే ఎరుపు, తెలుపు గాజులు శాంతిబాయి చేతికి ఉన్నాయని చెప్పారు. ‘హిందూ పాకిస్థానీ డిస్ప్లేస్డ్ యూనియన్ అండ్ బోర్డర్ పీపుల్స్ ఆర్గనైజేషన్’కు చెందిన దిలీప్ సింగ్ ఆ జంట ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి వివరాలు కోరగా.. పాక్ నుంచి స్పందన వచ్చింది. ఆ వివరాల ప్రకారం.. వారిద్దరూ జూన్ 21వ తేదీన తమ ఇంటి నుంచి మోటార్సైకిల్పై బయల్దేరారు. ఆ బైక్ను ఇండో-పాక్ సరిహద్దుల్లోని నూర్పూర్ దర్గా వద్ద పార్క్ చేసి, అక్కణ్నుంచీ కాలినడకన సరిహద్దు దాటి రాజస్థాన్లోని జైసల్మేర్లోకి ప్రవేశించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. అక్కడ ప్రాణాలు కోల్పోయారు.
Updated Date - Jul 01 , 2025 | 07:12 AM