Rajnath Singh: పాకిస్థాన్పై మరోసారి నిప్పులు చెరిగిన రక్షణ మంత్రి
ABN, Publish Date - Jun 26 , 2025 | 09:16 AM
పాకిస్థాన్పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అని కుండబద్దలు కొట్టారు.
బీజింగ్, జూన్ 26: ఉగ్రవాద చర్యలకు ఊతం ఇచ్చేలా వ్యవహరిస్తున్న పాకిస్థాన్పై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం చైనాలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్య దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించారు. ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటూ సభ్య దేశాల ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అంటూ కుండ బద్దలు కొట్టారు.
కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయన్నారు. అందులోభాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తరహా ద్వంద విధానాలకు స్థానం లేదంటూ ఎస్సీవో సభ్య దేశాలకు ఆయన స్పష్టం చేశారు. అటువంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకుండా ఖండించాలని ఆయా సభ్య దేశాలకు రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు భారత్ చర్యలు చేపట్టిందన్నారు. ఉగ్రవాదం వల్ల జరిగే పరిణామాలను ఆయన వివరించారు. వాటిని నిర్మూలించేందుకు తాము ఎంత మాత్రం వెనకాడబోమన్నారు. మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది.. ఆ దాడుల లక్ష్యం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనే విషయాన్ని ఈ సందర్భంగా సభ్య దేశాలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు.
యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించేందుకు భారత్ సానుకూల చర్యలు చేపట్టిందని వివరించారు. భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో 'ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ఈ దేశాల మండలి సంయుక్త ప్రకటన విడుదల చేయడం ఈ సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక అని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఎస్సీవో సదస్సు జూన్ 27వ తేదీతో ముగియనుంది.
Updated Date - Jun 26 , 2025 | 11:32 AM