Microsoft: ఏఐతో మైక్రోసాఫ్ట్కు రూ.4 వేల కోట్లు ఆదా
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:30 AM
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ఏఐ ను వాడుతూ ఓ వైపు భారీ లబ్ధి పొందుతుంటే.
వందేళ్లయినా ఏఐ ఆ పనులైతే చేయలేదు: బిల్గేట్స్
వాషింగ్టన్, జూలై 10: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుతూ ఓ వైపు భారీ లబ్ధి పొందుతుంటే.. మరోవైపు ఏఐ ఇంకా 100 ఏళ్లయినా కొన్ని పనులు అస్సలు చేయలేదంటూ ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ చెబుతున్నారు. గత ఏడాది ఏఐ వినియోగం ద్వారా 500 మిలియన్ డాలర్లు (రూ.4,285 కోట్లు) ఆదా చేసిన మైకోసాఫ్ట్.. అదే సమయంలో 9,100 మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం. ‘ముఖ్యంగా కాల్ సెంటర్ కార్యకలాపాల్లో ఏఐని వాడటంతో ఖర్చు భారీగా తగ్గింది. అంతేకాకుండా కస్టమర్లకు మెరుగైన సేవలందుతున్నాయి’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ ఆల్థోఫ్ తెలిపారు. అయితే ఏకంగా 9,100 మంది ఉద్యోగులను తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఏఐపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా 100 ఏళ్లయినా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదన్నారు. కోడింగ్కు కూడా మానవ మేధ అవసరమని చెప్పారు.
Updated Date - Jul 11 , 2025 | 04:30 AM