India Pakistan Conflict: అలా ఎలా విరమిస్తారు
ABN, Publish Date - May 12 , 2025 | 04:30 AM
ఉగ్ర స్థావరాలపై స్పష్టమైన విజయం సాధించిన తర్వాత కూడా భారత్ పాక్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం విమర్శలకు దారితీసింది. ఈ నిర్ణయం భారత రాజకీయ ధోరణిని ప్రతిబింబిస్తోందంటూ విశ్లేషకులు, ప్రజలు సోషల్మీడియాలో తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై పలువురి వ్యతిరేకత
యుద్ధంలో పైచేయి మనదే ఐనా విరమణ ఏంటని ధ్వజం
పాక్పై దొరికిన పట్టును బిగిద్దామని.. ప్రధాని మోదీ
నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం!
అంతలోనే వెనక్కి తగ్గడంపై సర్వత్రా సందేహలు
న్యూఢిల్లీ, మే11: పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై ఉక్కుపాదం మోపిన భారతదేశం.. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేసి యుద్ధంలో స్పష్టమైన పైచేయి సాధించిన భారతదేశం.. ఆ ఉత్సాహంతో మరింత ముందుకెళ్లి పాక్కు బుద్ధి చెప్పకపోగా.. ఎలాంటి స్పష్టమైన ప్రయోజనమూ లేకుండానే కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవడం భారతీయుల్లో చాలా మందికి నచ్చలేదు. భారత్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారని పేర్కొంటూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తాసంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘గెలుపు ముంగిట నిలబడి.. ఓటమిని అందుకోవడం చాలాకాలంగా భారతదేశ రాజకీయ సంప్రదాయంగా మారిపోయింది’’ అంటూ విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు బ్రహ్మ చెల్లనీ వంటివారు ‘ఎక్స్’లో పెట్టిన పోస్టులను అందులో ఉటంకించింది. ‘‘కాల్పుల విరమణకు ఒప్పుకొన్నారంటే.. ‘ఆపరేషన్ సిందూర్’కు ఒక తార్కిక ముగింపు ఇవ్వకూడదని ప్రధాని మోదీ నిర్ణయించారా?’’ అని తన పోస్టులో ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదుల ద్వారా భారత్పై వెయ్యి కోతల యుద్ధానికి (వార్ ఆఫ్ ఎ థౌజండ్ కట్స్) పాకిస్థానీ సైనిక జనరళ్లు రచించిన 4దశాబ్దాల వ్యూహానికి శాశ్వతం గా అడ్డుకట్ట వేయడమే ‘ఆపరేషన్ సిందూర్’కు తార్కిక ముగింపు అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనూ భారత్ ఇదే తప్పు చేసిందంటూ కొన్ని ఉదాహరణలిచ్చారు.
1948లో పాకిస్థాన్తో యుద్ధంలో మన సైన్యం విజయం దిశగా దూసుకెళ్తున్నప్పుడు భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిందని.. 1971 యుద్ధంలో గెలిచినా పాకిస్థాన్ నుంచి ఏమీ పొందకుండానే 1972లో సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకుందని గుర్తుచేశారు. అలాగే 3.3లక్షల మంది ఫాలోవర్లున్న ‘ట్రూ ఇండాలజీ’ అనే మితవాద వర్గానికి చెందిన మరో ‘ఎక్స్’ ఖాతా కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా తన చౌకబారు రాజకీయాలతో.. భారత్కు దక్కాల్సిన విజయాన్ని దక్కకుండా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘పాకిస్థాన్ అన్యాయంగా ఆక్రమించిన మన భూమిలో ఒక్క అంగుళాన్ని తిరిగి పొందలేకపోయాం’’అని ఆవేదన వెలిబుచ్చింది. కాగా పాక్తో యుద్ధం విషయంలో ముందుకే వెళ్లాలన్నది భారత్ ఉద్దేశమని.. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నవారందరిదీ ఏకగ్రీవంగా ఇదే మాట అని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.
ఆభేటీలో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోభాల్, మహాదళపతి అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, ఐబీ, రా చీఫ్లు పాల్గొన్నారు. సైనికుల నైతికస్థైర్యం, తగినన్ని ఆయుధాలు, సమృద్ధిగా ఆర్థిక పరిస్థితి, అరేబియా మహాసముద్రంలో నౌకా దళ బలిమి.. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో యుద్ధంలో ముందుకే వెళ్లాలని, పాక్పై సాధించిన పట్టును మరింతగా బిగించాలని భావించినట్టు ఆ కథనంలో పేర్కొంది. కానీ, ఆ తరువాత కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించినట్టు వెల్లడించింది. పాక్ అణు ప్రయోగం చేసే ముప్పుందన్న సమాచారం తమకుందని జేడీవాన్స్ చేసిన హెచ్చరికలతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందనుకున్నా పాక్ అణుహెచ్చరికలు కొత్త కావు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ ఎందుకు ఒప్పుకొందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకట్లేదు.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్
Updated Date - May 12 , 2025 | 04:56 AM