EPFO: ఆటో సెటిల్మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు
ABN, Publish Date - Jun 25 , 2025 | 07:06 AM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్ఫవో) తన చందాదారులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ సభ్యులు ఆటో సెటిల్మెంట్ పద్ధతిలో విత్డ్రా చేసుకునే సొమ్ము పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది.
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ, జూన్ 24: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్ఫవో) తన చందాదారులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ సభ్యులు ఆటో సెటిల్మెంట్ పద్ధతిలో విత్డ్రా చేసుకునే సొమ్ము పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఈ విధానంలో ప్రస్తుతం రూ.లక్ష మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం ప్రకటించారు. ఆటో సెటిల్మెంట్ విధానంలో ప్రస్తుతం మూడు రోజుల్లోపే చందాదారుల ఖాతాల్లో రూ.లక్ష వరకు జమ చేస్తున్నారు. ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం ద్వారా సభ్యుల అత్యవసర ఖర్చులకు నిధులు ఉపయోగపడతాయని, సొమ్ములు వేగంగానూ అందుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.
దీనివల్ల లక్షలాది మంది పీఎఫ్ చందాదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈపీఎ్ఫవోలో ప్రస్తుతం 7 కోట్ల మందికి పైగా సభ్యులు ఉన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో పీఎఫ్ చందాదారులు ఆన్లైన్లో నగదు ఉపసంహరించుకునేందుకు తొలిసారిగా ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సత్వరమే నగదు అందేలా చూసేందుకు ఈ పద్ధతిని అమలు చేశారు. ఆ తర్వాత అనారోగ్యం, విద్య, వివాహం, ఇంటి నిర్మాణం వంటి అవసరాలకు కూడా దీన్ని వర్తింపజేశారు. ఈ విధానంలో ఉద్యోగుల క్లెయిమ్లను మానవ ప్రమేయం లేకుండా సిస్టమ్ ఆటోమేటిక్గా పరిష్కరిస్తుంది.
Updated Date - Jun 25 , 2025 | 07:06 AM