E-aadhaar: ఈ-ఆధార్ యాప్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం
ABN, Publish Date - Aug 07 , 2025 | 04:38 PM
ఆధార్ కార్డు వివరాల అప్డేషన్ మరింత సులభతరం చేసే యాప్ అభివృద్ధిపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ యాప్ సాయంతో పేరు, అడ్రస్ వంటి వివరాలను యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా మరింత సులువుగా అప్డేట్ చేసుకోవచ్చని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: డిజిటలీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆధార్ సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ఓ కొత్త యాప్ అభివృద్ధిపై కేంద్రం దృష్టిపెట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ-ఆధార్ పేరిట ఈ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తేనున్నారు. దీని ద్వారా పౌరులు తమ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ తదితర సాధారణ వివరాలను స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. అధార్ వివరాల అప్డేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ యాప్ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు పౌరులు వెళ్లాల్సిన అవసరం చాలా వరకూ తగ్గుతుందని యూఐడీఏఐ వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ సాయంతో యూజర్లు రోటిన్ వివరాలను సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. యూజర్లకు అత్యంత అనుకూలంగా ఉండేలా యాప్ ఇంటర్ఫేస్ను డిజైన్ చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే భారీ క్యూలల్లో నిలబడటం, పేపర్వర్క్, వివరాల అప్డేషన్లో అనవసర జాప్యం వంటి చిక్కులన్నీ తొలగిపోతాయి. యాప్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు కేవలం తమ బయోమెట్రిక్ వివరాల (ఐరిస్, ఫింగర్ ప్రింట్స్) అప్డేషన్ కోసమే ఆధార్ కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది.
ఈ యాప్లో కృత్రిమ మేధను కూడా జోడించడం మరో హైలైట్ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫేస్ ఐడీ టెక్నాలజీని కూడా జోడించనున్నారు. దీంతో, ఆధార్ సేవలు పొందడం మరింత సులభతరం కావడంతో పాటు ఐడీ ఫ్రాడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. ఇక అప్డేషన్ ప్రక్రియలో భాగంగా ఇతర ప్రభుత్వ డేటాబేస్ల నుంచి సంబంధిత డాక్యుమెంట్స్ను సేకరించగలిగేలా ఈ యాప్ను డిజైన్ చేస్తున్నారు. పాన్ డేటాబేస్, పాస్పోర్టు ఆఫీస్, డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రీ, పీడీఎస్ రేషన్ కార్డు సిస్టమ్, ఎమ్ఎన్ఆర్ఈజీఏ రికార్డ్స్తో యూజర్ సమర్పించిన వివరాలను సరిపోల్చాక అప్డేషన్ పూర్తయ్యేలా ఈ యాప్ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నివాస ధ్రువీకరణ కోసం విద్యుత్ బిల్లులను ఈ యాప్ ద్వారా ఆమోదిస్తారు.
ఆధార్ ఆధారిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విస్తృత స్థాయి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ యాప్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఆధార్ సేవలు మరింత సులభతరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..
భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..
For More National News and Telugu News
Updated Date - Aug 07 , 2025 | 05:44 PM