Rahul Gandhi: ఓట్ చోరీపై తాడో పేడో!
ABN, Publish Date - Aug 17 , 2025 | 05:01 AM
ఓట్ చోరీ పై తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమస్థాయిలో విజృంభించేందుకు సిద్ధమైంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్లో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎ్సఐఆర్) పేరిట 65 లక్షల ఓట్లను తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
బిహార్లో నేటి నుంచి రాహుల్ ‘ఓట్ అధికార్ యాత్ర’
20 జిల్లాల్లో 16 రోజులు
పెద్ద ఎత్తున పాల్గొననున్న ఇండియా కూటమి పార్టీలు
ఇది ఎస్ఐఆర్పై యుద్ధం
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయి: కాంగ్రెస్
పట్నా, ఆగస్టు 16: ‘ఓట్ చోరీ’పై తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమస్థాయిలో విజృంభించేందుకు సిద్ధమైంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్లో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎ్సఐఆర్) పేరిట 65 లక్షల ఓట్లను తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. దీనిని మరింత తీవ్రతరం చేయనుంది. ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేయడంతోపాటు, ఎస్ఐఆర్ ద్వారా ఓటు హక్కుపై జరుగుతున్న దాడిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నుంచి ‘ఓట్ అధికార్’ పేరుతో యాత్ర చేపట్టనున్నారు. సెప్టెంబరు 1వ తేదీ వరకు నిర్వహించే ఈ యాత్ర మొత్తం 16 రోజలు పాటు 20 జిల్లాల్లో కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అఖిలేశ్ ప్రసాద్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన పట్నాలో మాట్లాడుతూ... యాత్ర జరిగే 16 రోజుల పాటు రాహుల్ గాంధీ బిహార్లోనే ఉంటారని, సెప్టెంబరు 1న రాష్ట్ర రాజధాని పట్నాలో యాత్ర ముగియనుందని వివరించారు. ‘‘ఓట్ అధికార్ యాత్రను ససారం నుంచి ఆదివారం రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు ఇప్పటికే తీసుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా బ్లాక్ తరఫున నిర్వహించే ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. సుమారు 15 రోజుల పాటు రాహుల్ రాష్ట్రంలోనే ఉండనున్నారు. యాత్రను ముందుండి నడిపించనున్నారు. ఈ నెల 20, 25, 31 తేదీల్లో మినహా.. మిగిలిన అన్ని రోజులు యాత్ర కొనసాగుతుంది. తొలిరోజు యాత్రలో రాహుల్తో కలిసి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు పాల్గొంటారు. మాతో కలిసివచ్చే ఇతర పార్టీల నాయకులను కూడా కలుపుకొని వెళ్తాం.’’ అని అఖిలేశ్ ప్రసాద్ సింగ్ అన్నారు. ఈ యాత్రను ఎస్ఐఆర్పై యుద్ధంగా అభివర్ణించారు. మరో నేత పవన్ ఖెరా మాట్లాడుతూ.. ఈయాత్ర భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ‘‘ఓటు దొంగిలించడమేకాదు.. ప్రజల గుర్తింపును కూడా దొంగిలిస్తున్నారు.’’ అని ఖెరా విమర్శించారు.
చంద్రబాబూ ఆందోళన వ్యక్తం చేశారు
ఓట్ల అక్రమాలపై వీధుల్లోకి రావడం తప్ప.. తమకు మరో మార్గం లేకుండా పోయిందని అఖిలేశ్ ప్రసాద్ సింగ్ అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చించాలని కోరినా తమ విజ్ఞప్తిని పెడ చెవిన పెడుతున్నారని అన్నారు. అందుకే ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకున్నామన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారం... రాజ్యాంగం మూర్ఖులు, మోసగాళ్ల నుంచి అతిపెద్ద ముప్పును ఎదుర్కొంటుందని అంబేడ్కర్ చేసిన హెచ్చరికను గుర్తుకు తెచ్చేలా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్పై అన్ని పార్టీలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అఖిలేశ్ ప్రసాద్ సింగ్ అన్నారు. వీటిలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నాయని, ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ఎస్ఐఆర్ పేరుతో లక్షల మంది ఓట్లను జాబితాల నుంచి తొలగిస్తుండడం పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆవేదన ఉందన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఎస్ఐఆర్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయాన్ని తనకు స్వయంగా ఆయన చెప్పారని అఖిలేశ్ ప్రసాద్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. అయితే.. బయట మాత్రం పార్టీలైన్కు అనుగుణంగా గిరిరాజ్ మాట్లాడుతున్నారని అన్నారు.
ఇక, జరగనివ్వం: రాహుల్
ఓట్ల చోరీ ఇకపై జరగనివ్వబోమని, ప్రజలు మేల్కొన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓటును తస్కరించడమంటే.. హక్కులను తస్కరించడమేనని చెప్పారు. ‘‘ఏమాత్రం అలికిడి లేకుండా ఓట్లు తస్కరించేస్తున్నారు. కానీ, ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు. ఇకపై చోరీ జరగదు. మన హక్కులు కాపాడుకునేందుకు, ఓట్ చోరీపై ఐక్యగళం వినిపిద్దాం.’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, ‘ఓటు చోరీ ఆపండి’ పేరుతో భారత యువజన కాంగ్రె్స(ఐవైసీ) శనివారం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐవైసీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబాల్లోని ఓటర్ల వివరాలను అధికారిక జాబితాతో పోల్చి సరిచూడనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఐవైసీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్.. జమ్ము ఉత్తర నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు.
చోరీపై ‘లాపతా ఓట్’ వీడియో
ఓట్ చోరీపై శనివారం రాహుల్ ‘లాపతా ఓట్’(ఓటు కోల్పోయిన) పేరుతో ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్కు వచ్చి.. తన ఓటు చోరీ చేశారిని, తనదే కాకుండా.. లక్షల మంది ఓట్లు కూడా చోరీ చేశారని ఫిర్యాదు చేస్తాడు. దీంతో పోలీసులు తమ సంగతేంటని వారి ఓట్లను పరిశీలించుకుంటారు. అయితే, జాబితాలో వారి ఓట్లు కూడా గల్లంతుకావడంతో నిర్ఘాంతపోవడంతో వీడియో ముగుస్తుంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ.. ఓట్ చోరీని ‘డూ ఆర్ డై’(జీవించడమా-మరణించడమా)గా పేర్కొంది.
యాత్ర జరిగే రోజులు : 16
కొనసాగనున్న జిల్లాలు : 20
మొత్తం దూరం : 1300 కి.మీ.
రాహుల్ ఆరోపణలపై నేడు ఈసీ స్పష్టత!
ఢిల్లీలో విలేకర్ల సమావేశం నిర్వహించనున్న ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఓట్ చోరీ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మీడియా సమావేశం అజెండా ఏమిటనేది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ప్రతిపక్షాల నిరసన, ఆరోపణల మీద సమాధానం ఇవ్వటం కోసమే నిర్వహిస్తున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించటానికి తప్ప ఇతర అంశాలపై ఈసీ విలేకరుల సమావేశం జరపటం చాలా అరుదు. బిహార్లో రాహుల్ చేపట్టనున్న ‘ఓట్ అధికార్ యాత్ర’ ఆదివారం నుంచే ప్రారంభం కానుండటం గమనార్హం. మరోవైపు, ఆరోపణలపై రుజువులు సమర్పించాలని రాహుల్ గాంధీకి నోటీసులిచ్చిన ఎన్నికల సంఘం అధికారులు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలపైన కూడా ఎందుకు నోటీసులివ్వలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు గెల్చిన నియోజకవర్గాల్లో నకిలీ ముస్లిం ఓటర్లు ఉన్నారని, ఆ ఓట్లతోనే వారు గెలిచారని, వారి ఎన్నికను రద్దు చేయాలని అనురాగ్ ఈ నెల 14న ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నేత పవన్ఖేరా స్పందిస్తూ.. ఈసీ ఎలకా్ట్రనిక్ డేటా ఇవ్వకపోవటం వల్ల ఒక్క మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో డేటాను విశ్లేషించేందుకే తమకు 6 నెలల సమయం పట్టిందని, అనురాగ్ ఠాకూర్కు మాత్రం ఆరు లోక్సభ సీట్ల తాలూకు ఎలకా్ట్రనిక్ డేటా ఎలా లభించిందని ప్రశ్నించారు. ఆయనకు ఈసీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇదిలా ఉండగా, ఓట్లచోరీ అంశంపై ఆరోపణలకు సంబంధించి రాహుల్గాంధీ ఈసీకి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదని, ముసాయిదా ఓటర్ల జాబితా పేర్లపై అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు మాత్రమే అఫిడవిట్ అవసరమని ఎన్నికల మాజీ సీఈసీ ఓపీ రావత్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఈసీ ఆదివారం సమావేశంలో వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్కు చైనా మంత్రి.. ఎందుకంటే..
రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2025 | 05:01 AM