Indian students return: ఎయిర్స్పేస్ తెరిచిన ఇరాన్.. ఢిల్లీకి రానున్న 1,000 మంది భారతీయ విద్యార్థులు
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:46 PM
ఇరాన్ నగరాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,000 మంది భారతీయ విద్యార్థులను 'ఆపరేషన్ సింధు' కింద ప్రత్యేక విమానాల్లో న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారు. రాబోయే రెండ్రోజుల్లో వీరంతా ఢిల్లీకి చేరుకుంటారు.
న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియాకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే మూసివేసిన ఎయిర్స్పేస్ (Air space)ను తెరిచింది. దీంతో ఇరాన్ నగరాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,000 మంది భారతీయ విద్యార్థులను 'ఆపరేషన్ సింధు' (Operation Sindhu) కింద ప్రత్యేక విమానాల్లో న్యూఢిల్లీకి తీసుకువస్తున్నారు. రాబోయే రెండ్రోజుల్లో వీరంతా ఢిల్లీకి చేరుకుంటారు.
తొలివిమానం
కాగా, ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థులతో వస్తున్న తొలివిమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు న్యూఢిల్లీ చేరే అవకాశం ఉంది. రెండో విమానం శనివారం ఉదయం, మూడో విమానం అదేరోజు సాయంత్రం ఇండియాకు చేరుకుంటాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో దాదాపు అన్ని అంతర్జాతీయ విమానాలకు ఎయిర్స్పేస్ను ఇరాన్ మూసివేసింది. అయితే ఇండియా కోసం ప్రత్యేకమైన క్యారిడార్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించేందుకు ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇరాన్లో 4,000 మందికి పైగా భారతీయులు నివసిస్తుండగా, వీరిలో సగం మంది విద్యార్థులు ఉన్నారు. 'ఆపరేషన్ సింధు' కింద భారత ప్రభుత్వం 110 మంది భారతీయ విద్యార్థులను ఇప్పటికే న్యూఢిల్లీకి తీసుకువచ్చింది. వీరంతా ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకోవడంతో అక్కడి నుంచి వారిని ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లీషు భాషపై అమిత్షా వ్యాఖ్యలకు రాహుల్గాంధీ కౌంటర్
వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము
For National News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 06:09 PM