Trump To Meet Putin: 15న పుతిన్తో భేటీ అవుతున్నా
ABN, Publish Date - Aug 10 , 2025 | 02:36 AM
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి రష్యా
అలాస్కాలో కలవనున్నాం.. పుతిన్, జెలెన్ స్కీ ఇద్దరూ శాంతిని కోరుకుంటున్నారు
రష్యా, ఉక్రెయిన్ మధ్యభూభాగాల మార్పిడి ఉంటుంది: ట్రంప్
మా భూభాగాలను వదులుకొనే ప్రసక్తే లేదు: జెలెన్ స్కీ
పుతిన్, జెలెన్ స్కీ శాంతి కోరుకుంటున్నారు
ఇరు దేశాల మధ్య భూభాగాల మార్పిడి: ట్రంప్
వాషింగ్టన్, ఆగస్టు 9: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 15వ తేదీన భేటీకానున్నారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రుత్’లో ఈ వివరాలు వెల్లడించారు. ‘‘అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమావేశం ఆగస్టు 15న జరగనుంది. నేను, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కాలో సమావేశం కానున్నాం. మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాను..’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా, రష్యా అధ్యక్షులు నేరుగా భేటీకావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. అప్పటి అధ్యక్షుడు జో బిడెన్ జెనీవాలో పుతిన్తో భేటీ అయ్యారు. ఇక పుతిన్ అమెరికా గడ్డమీద చివరిసారిగా 2015 సెప్టెంబర్లో అడుగుపెట్టారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన ఆయన.. అప్పటి అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయ్యారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య భూభాగం మార్పిడి ఉండొచ్చు..
‘ట్రూత్’లో పోస్టు పెట్టడానికి ముందు అమెరికా అధ్యక్ష నివాసం వైట్హౌజ్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ శాంతిని కోరుకుంటున్నారని చెప్పారు. ‘‘శాంతి ఒప్పందమంటే.. ఇరు దేశాల మధ్య భూభాగాల మార్పిడి ఉంటుంది. ఇరుదేశాలకూ ప్రయోజనం కలిగించేలా.. కొన్ని ప్రాంతాలను తిరిగి ఇవ్వడం, మరికొన్నింటిని వదులుకోవడం జరగవచ్చు. ఇదంత సులువేమీకాదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ఒప్పందం దిశగా ఇదే చివరి అవకాశమా? అని మీడియా ప్రస్తావించగా.. ‘‘చివరి అవకాశం అనే పదాలను వాడటం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా తుపాకులు పేలడం మొదలైతే.. వాటిని ఆపడం చాలా కష్టం’’ వ్యాఖ్యానించారు. కాగా, పుతిన్తో ట్రంప్ చర్చలు జరపనుండటాన్ని భారత్ స్వాగతించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఇది ముగింపు పలికి, శాంతిని నెలకొల్పుతుందని భావిస్తున్నామని విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
భూభాగాలను వదులుకునే ప్రసక్తే లేదు: జెలెన్ స్కీ
ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాలను వదులుకోవాల్సి రావొచ్చన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. ఉక్రెయిన్కు భాగస్వామ్యం లేకుండా ట్రంప్, పుతిన్ల మధ్య జరిగే చర్చలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని.. వారు ఏదైనా డీల్ కుదుర్చుకుంటే అది ‘విఫల పరిష్కారమే’నని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన టెలిగ్రామ్లో పోస్టు పెట్టారు. ‘‘అలాస్కాలో పుతిన్తో ట్రంప్ భేటీ అవుతున్నట్టు ప్రకటించారు. మా ప్రజలకు వ్యతిరేకంగా, మా భూభాగంలో జరుగుతున్న యుద్ధానికి దూరంగా జరిగే ఈ చర్చల్లో మా భాగస్వామ్యం లేకుండా ఎలాంటి ఫలితం ఉండదు. మేం అసలైన శాంతిని కోరుకుంటున్నాం. మా భూభాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదు..’’ అని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
భారత్, పాక్ యుద్ధంలో ఆరు విమానాలు కూలాయి: ట్రంప్
భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ట్రంప్ జోక్యంతో అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై వైట్హౌజ్లో జరిగిన కార్యక్రమంలో ఇరుదేశాల నేతలతోపాటు ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో శాంతిని, సుస్థిరతను నెలకొల్పాలన్నదే అమెరికా అధ్యక్షుడిగా నా కోరిక. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ సహా ఐదు యుద్ధాలను ఆపాను. భారత్, పాక్ యుద్ధం ఆపడం పెద్ద విషయం. వాళ్లు యుద్ధ విమానాలతో దాడులు చేసుకున్నారు. ఐదారు యుద్ధ విమానాలు కూలిపోయాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అందుకే నేను జోక్యం చేసుకున్నాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఏ దేశ విమానాలు కూలాయన్న వివరాలేవీ ఆయన ప్రస్తావించలేదు.
Updated Date - Aug 10 , 2025 | 02:36 AM