Trump Meets Zelensky: భారత్ నుంచి అమెరికాకు.. పెరిగిన ఎగుమతులు
ABN, Publish Date - Aug 19 , 2025 | 02:24 AM
ఉక్రెయిన్కు రక్షణగా నిలుస్తామని.. శాంతి కోసం అవసరమైతే అమెరికా దళాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. యూరప్ దేశాలు ముందు నిలుస్తాయని, తాము వీలైనంత సహాయం చేస్తామని చెప్పారు.....
భద్రతకు కట్టుబడి ఉంటాం.. శ్వేతసౌధంలో జెలెన్స్కీతో భేటీలో ట్రంప్
7 రెట్ల మేర వృద్ధి.. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లే..
వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రాయితీలు కూడా ఇస్తున్న ఎగుమతిదారులు
తర్వాత యూరప్ నేతలతో కలసి భేటీ
వాషింగ్టన్, ఆగస్టు 18: ఉక్రెయిన్కు రక్షణగా నిలుస్తామని.. శాంతి కోసం అవసరమైతే అమెరికా దళాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. యూరప్ దేశాలు ముందు నిలుస్తాయని, తాము వీలైనంత సహాయం చేస్తామని చెప్పారు. యూరప్ దేశాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు. నిజానికి కాల్పుల విరమణ పాటించాలని తాను కోరానని, కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ అందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. సోమవారం అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో జెలెన్స్కీ, యూరప్ దేశాల నేతలతో జరిగిన చర్చల్లో ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ చర్చల తర్వాత పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడనున్నట్టు చెప్పారు.
ఇక శాంతి ఒప్పందంలో భాగంగా తమ భద్రతకు అవసరమైన అన్ని రకాల సహాయం చేయాలని అమెరికా, యూరప్ దేశాలను జెలెన్స్కీ కోరారు. బలమైన సైన్యం, ఆయుధాలు, శిక్షణ, నిఘా వ్యవస్థలు ఉక్రెయిన్కు అవసరమని.. ఇదంతా అమెరికా, యూరప్ దేశాల చేతిలో ఉందని పేర్కొన్నారు. యూర్పలో ఒక్క దేశంలో శాంతికోసం చర్చించడమంటే.. మొత్తం యూరప్ శాంతి కోసమని జెలెన్స్కీ అభివర్ణించారు. తాము యుద్ధం నిలిపివేయడంపై దృష్టిపెడితే.. రష్యా దాడులు చేస్తూ, ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోందని మండిపడ్డారు. ట్రంప్తో భేటీ కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోపాటు ఫ్రాన్స్, ఫిన్లాండ్ అధ్యక్షులు మేక్రాన్, అలెగ్జాండర్ స్టబ్, బ్రిటన్, ఇటలీ ప్రధానులు కీర్ స్టార్మర్, జార్జియా మెలొనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, నాటో జనరల్ సెక్రెటరీ మార్క్ రూట్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లెయెన్ శ్వేతసౌధానికి వచ్చారు. ఒక దేశం విషయంలో ఇంత మంది ప్రపంచ నేతలు ఇలా తమ పనులన్నీ వదులుకుని వచ్చి భేటీకావడం అరుదైన ఘటన అని అమెరికా అధికారవర్గాలు పేర్కొన్నాయి.
పతుల ద్వారా సతుల లేఖలు!
ఉక్రెయిన్లో యుద్ధం ఆపాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ సతీమణి మెలనియా లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాస్కాలో జరిగిన చర్చల సందర్భంగా ట్రంప్ స్వయంగా ఆ లేఖను పుతిన్కు అందజేశారు. తాజాగా చర్చల కోసం శ్వేతసౌధానికి వచ్చిన జెలెన్స్కీ.. ట్రంప్ సతీమణి మెలనియాకు తన సతీమణి ఒలెనా జెలెన్స్కా రాసిన లేఖను ట్రంప్కు అందించారు. మరోవైపు, యుద్ధ విరమణ కోసం వాషింగ్టన్లో ట్రంప్, జెలెన్స్కీ, యూరప్ నేతలు భేటీ అవుతున్న తరుణంలోనే.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది.
ఆ రెండూ వదులుకోవాల్సిందే!
జెలెన్స్కీ, యూరప్ దేశాల నేతలతో భేటీకి ముందు యుద్ధ విరమణ కోసం ఉక్రెయిన్ తన డిమాండ్లను వదులుకోవాల్సిందేనంటూ ట్రంప్ ట్రూత్ వేదికగా పోస్టు పెట్టారు. 12 ఏళ్ల క్రితం రష్యా చేతిలోకి వెళ్లిన క్రిమియా ద్వీపకల్పం తిరిగి రాదని, నాటోలోకి ఉక్రెయిన్కు ప్రవేశం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే రష్యాకు ఉక్రెయిన్ భూభాగాల అప్పగింత అంశాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
సూట్లో బాగున్నారు జెలెన్స్కీ!
ట్రంప్తో, ఇతర దేశాధినేతలతో భేటీల సమయంలో జెలెన్స్కీ సాధారణ టీషర్టులు ధరించి వస్తుంటారు. అధికారిక భేటీలకు ఇలా రావడం ఏమిటన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ట్రంప్తో భేటీలో ఓ జర్నలిస్టు దీనిపై ప్రశ్నించడం, ఆ భేటీలో ట్రంప్తో జెలెన్స్కీ వాగ్వా దం చర్చనీయాంశంగా మారాయి కూడా. తాజాగా ట్రంప్ భేటీకి వచ్చే ముందు కాస్త పద్ధతిగా దుస్తులు ధరించి రావాలని అమెరికా అధికారులు జెలెన్స్కీని కోరినట్టు సమాచారం. సోమవారం ట్రంప్తో భేటీలో జెలెన్స్కీ నలుపు రంగు ఫార్మల్ సూట్ ధరించి కనిపించారు. ‘మీరు ఈ సూట్లో చాలా బాగున్నారు’ అని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
మోదీకి పుతిన్ ఫోన్
ప్రధాని మోదీకి సోమవారం పుతిన్ ఫోన్ చేశారు. అలాస్కాలో ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశం వివరాలను పంచుకున్నారు. ఉక్రెయిన్తో సంక్షోభం శాంతియుతంగా ముగియాలన్న మోదీ.. ఈ దిశగా జరుగుతున్న యత్నాలకు భారత్ అన్ని విధాలుగా సహకరిస్తుందని మోదీ ఈ సందర్భంగా పుతిన్తో చెప్పినట్లు పీఎంవో కార్యాలయం వెల్లడించింది.
Updated Date - Aug 19 , 2025 | 07:53 AM