Trump Comment: భారత్, రష్యాను చైనాకు కోల్పోయాం
ABN, Publish Date - Sep 06 , 2025 | 05:18 AM
ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి మాట్లాడుకోవడంపై..
‘ట్రూత్ సోషల్’లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్
మూడు దేశాలూ చిరకాలం వర్ధిల్లాలని వ్యంగ్యవ్యాఖ్య
టెక్ లీడర్స్తో భేటీ.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్పై ప్రశంసలు
అమెరికాలో ఎంత పెట్టుబడులు పెడుతున్నారంటూ ప్రశ్న
న్యూయార్క్/వాషింగ్టన్, సెప్టెంబరు 5: ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి మాట్లాడుకోవడంపై.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగా ఆలస్యంగా అయినా తనదైన శైలిలో స్పందించారు! ఆ ముగ్గురు దేశాధినేతలూ కలిసి ఉన్న ఫొటోను తన సొంత సామాజిక మాధ్యమమైన ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేసి.. ‘‘చూడబోతే మనం (అమెరికా).. ఇండియాను, రష్యాను చీకటి దేశమైన చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. అంతటితో ఆపలేదు.. ‘ఆ మూడు దేశాలూ చిరకాలం వర్ధిల్లుగాక’ అంటూ వ్యంగ్యాన్ని ఆ పోస్టుకు జోడించారు. ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పందన కోరగా.. దీనిపై తాము తక్షణం స్పందించదల్చుకోలేదని చెప్పారు. కాగా.. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాల అధిపతులకు ట్రంప్ గురువారం వైట్హౌ్సలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్పిచాయ్పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ టేబుల్ వద్ద ఉన్నవారంతా అత్యంత తెలివైన వ్యక్తులు. కచ్చితంగా ఇదొక హై-ఐక్యూ గ్రూప్. మీ అందరినీ చూసి నేను గర్విస్తున్నాను. మీతో కలిసి ఇక్కడ ఇలా ఉండడం నాకు లభించిన గౌరవం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా.. తనవద్ద మైక్రోసాఫ్ట్ షేర్లున్నాయని.. అవి 28 డాలర్ల నుంచి 500కు పైగా డాలర్లకు చేరాయని చెబుతూ.. సత్య నాదెళ్ల బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. టిమ్ కుక్, బిల్గేట్స్, మెటా జుకెర్బెర్గ్, శామ్ ఆల్ట్మన్ తదితర టెక్ దిగ్గజాలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు.. ట్రంప్ భార్య మెలానియా ఒక సమావేశం నిర్వహించారు. అందులో కూడా ఈ టెక్ దిగ్గజాలందరూ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సత్య నాదెళ్ల తర్వాత మాట్లాడిన బిల్గేట్స్.. తాను ఇప్పుడు జీవితంలో రెండో దశలో ఉన్నానని, సత్య నాదెళ్ల అద్భుతంగా పనిచేస్తుండడం వల్ల పెరుగుతున్న తన సంపదను దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చుచేస్తున్నానని చెప్పినప్పుడు ట్రంప్ పెద్దగా నవ్వారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ సుందర్పిచాయ్ని ఉద్దేశించి.. అమెరికాలో గూగుల్ ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటోందని ప్రశ్నించగా.. దానికి ఆయన వచ్చే రెండేళ్లలో 250 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్ల) మేర పెట్టుబడులు పెడతామని చెప్పారు. అందుకు ట్రంప్ ఆయన్ను ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
భారత్లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్పై నిషేధం
For More National News and Telugu News
Updated Date - Sep 06 , 2025 | 05:18 AM