Share News

First Tesla Car Delivery: భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:26 PM

ఇటీవల భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా దేశంలో తొలి కారును డెలివరీ చేసింది. ముంబైలోని సంస్థ షోరూమ్‌లో మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ ఈ కారు తాళాలను అందుకున్నారు. టెస్లాకు తొలి కస్టమర్‌గా నిలిచారు.

First Tesla Car Delivery: భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
Tesla Model Y India delivery

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఇటీవల కార్యకలాపాలు ప్రారంభించిన విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా తొలి కారును డెలివరీ చేసింది. దేశంలో టెస్లాకు తొలి కస్టమర్‌గా మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ నిలిచారు. ముంబైలోని టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో సంస్థ ప్రతినిధులు మోడల్ వై కారు తాళాలను మంత్రికి అందజేశారు. ఈ షోరూమ్‌ను టెస్లా జులైలో ప్రారంభించింది (First Tesla Model Y India delivery).

టెస్లా కారును డెలివరీ తీసుకున్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది వ్యక్తిగత అవసరాల కోసం చేసిన కొనుగోలు కాదని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పర్యావరణహిత లక్ష్యాలకు ప్రతీక అని వ్యాఖ్యానించారు. విద్యుత్ వాహన వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తాను స్వయంగా కారును డెలివరీ తీసుకున్నట్టు తెలిపారు (Pratap Sarnaik Tesla purchase).


పర్యావరణహిత సుస్థిర రవాణా వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఈ కారును తన మనవడికి బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. రాబోయే పదేళ్లల్లో విద్యుత్ వాహన వినియోగం భారీ స్థాయిలో పెంచాలన్నది మహారాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో దాదాపు 5 వేల వరకూ ఈ-బస్సులు ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు (Maharashtra green mobility push).

ఇక టెస్లా మోడల్ వై కారుకు సంబంధించి రెండు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. 60కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో కూడిన రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్ఠంగా 500 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. మరింత శక్తిమంతమైన బ్యాటరీ కలిగిన లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌తో సింగిల్ చార్జ్‌కు గరిష్ఠంగా 622 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇక టెస్లా త్వరలో ఢిల్లీలో మరో షో రూమ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.


ఇవి కూడా చదవండి

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్

For More National News and Telugu News

Updated Date - Sep 05 , 2025 | 04:46 PM