Trump Announces: చైనాపై మరో 100శాతం సుంకాలు
ABN, Publish Date - Oct 12 , 2025 | 04:19 AM
రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సుంకాలు, ఆంక్షలు అంటూ కలకలం రేపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు.......
ఇప్పటికే ఉన్న 30 శాతానికి అదనం
వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి..
8అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్, అక్టోబరు 11: రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సుంకాలు, ఆంక్షలు అంటూ కలకలం రేపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. పలు వాణిజ్య అంశాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోదంటూ.. చైనాపై 100శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ‘‘నవంబర్ 1 నుంచి చైనాపై 100శాతం సుంకాలు విధిస్తాం. ఇప్పటికే ఉన్న సుంకాలకు ఇది అదనం. చైనా ప్రతిస్పందించే తీరును బట్టి ఈ సుంకాల్లో మార్పు ఉండొచ్చు. అంతేకాదు.. నవంబర్ 1 నుంచి అమెరికా నుంచి చైనాకు జరిపే అన్ని రకాల కీలక సాఫ్ట్వేర్ల ఎగుమతులపై నియంత్రణలు విధిస్తాం. చైనా నుంచి వచ్చే అన్ని రకాల ఉత్పత్తులతోపాటు విదేశాల నుంచి అమెరికాకు వచ్చే చైనా ఉత్పత్తులకూ ఈ సుంకాలు, ఆంక్షలు వర్తిస్తాయి. చైనా నుంచి జరిగే కీలకమైన ఉత్పత్తుల సరఫరాపై నియంత్రణలు విధించేందుకు ఆ దేశం సిద్ధమైనట్టు తెలిసింది. అది నైతికంగా అవమానకర ప్రవర్తన’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా ప్రతీకార చర్యలకు దిగితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అరుదైన ఖనిజాలేంటి?
అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా టెక్, రక్షణ, ఎలకా్ట్రనిక్ కంపెనీలకు అత్యవసరమైన అరుదైన ఖనిజాలు, వాటితో రూపొందించే సహజ అయస్కాంతాలు చాలా వరకు చైనా నుంచే సరఫరా అవుతాయి. ఎల్ఈడీ లైట్లు, టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల నుంచి యుద్ధ విమానాలు, జలంతర్గాములు, లేజర్లు, ఉపగ్రహాలు, క్షిపణుల తయారీ వరకు ఆ ఖనిజాలు కావాలి. అంటే అమెరికా ఆయుధ, టెక్ కంపెనీలకు ఇవి తప్పనిసరి. ఇంత కీలకమైన అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ప్రాసెసింగ్లో 90శాతం వరకు చైనాలోనే జరుగుతుంది. ఈ రంగంలో ఉన్న పట్టుతోనే అమెరికాను కూడా చైనా ఆటాడిస్తోంది. మరోవైపు చైనా టెక్ కంపెనీలకు కీలకమైన కంప్యూటర్ చిప్స్ చాలా వరకు అమెరికా నుంచే అందుతాయి. ఈ ఏడాది ఏప్రిల్లో చైనా, అమెరికా ఏదో వేలం వేసినట్టుగా పరస్పరం 200శాతం దాకా టారి్ఫల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా చిప్స్ కోసం చైనా, చైనా ఖనిజాల కోసం అమెరికా దిగివచ్చాయి. కానీ చైనా ఇటీవల మళ్లీ అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు విధించింది. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాలో జరగనున్న ఏపీఈసీ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీని రద్దు చేసుకునే అవకాశం ఉందంటూ ట్రంప్ ముందుగానే సంకేతాలు ఇచ్చారు. తర్వాత టారి్ఫలపైనా ప్రకటన చేశారు. ప్రస్తుతం చైనాపై అమెరికా 30శాతం సుంకాలు అమలు చేస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన అమల్లోకి వస్తే సుంకాలు 130శాతానికి చేరుతాయి. తొలుత భారత్పై 25శాతం సుంకాలు విధించిన ట్రంప్ తర్వాత.. రష్యా నుంచి చమురు కొంటోందంటూ మరో 25శాతం పెంచి 50శాతం చేశారు. ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై అడ్డగోలు సుంకాలు విధించడం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా గందరగోళానికి తెరలేపింది.
Updated Date - Oct 12 , 2025 | 04:32 AM