Massive Protests In PoK: పాక్ ప్రధానికి ఊహించని షాక్.. పీఓకేలో తిరగబడ్డ ప్రజలు..
ABN, Publish Date - Sep 29 , 2025 | 03:10 PM
పాక్ ప్రభుత్వం పీఓకేలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పెద్దఎత్తున భద్రతా దళాలను రంగంలోకి దించింది. పంజాబ్ నుంచి వేల మంది సైనికులు పీఓకేకు వెళ్లారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవారం వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రధాని షరీఫ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలు చేపట్టారు. ముజఫరాబాద్, రావల్కోట్తోపాటు పలు ప్రాంతాల్లో స్కూళ్లు, షాపులు, ఇతర వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు పూనుకున్నారు.
వీలైనంత త్వరగా నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలని షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ టారీఫ్లు తగ్గించాలని, నిత్యావసర వస్తువులపై సబ్సీడీ ఇవ్వాలని అడుగుతున్నారు. కాశ్మీర్ శరణార్థులకు కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కూడా తీసేయాలని పట్టుబడుతున్నారు. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్నికల హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, నిరసనల నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. పరిస్థితులు చెయ్యి దాటి పోకుండా ఉండటానికి చర్యలు మొదలెట్టింది.
పీఓకేలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పెద్దఎత్తున భద్రతా దళాలను రంగంలోకి దించింది. పంజాబ్ నుంచి వేల మంది సైనికులు పీఓకేకు వెళ్లారు. శనివారం, ఆదివారం ప్రముఖ సిటీలకు వెళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఆర్మీ మూసివేసింది. ఏఏసీ కీలక నేత షౌకత్ నవాజ్ మిర్ మాట్లాడుతూ.. ‘మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం లేదు. గత 70 ఏళ్లుగా మాకు అందకుండా పోతున్న ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం’ అని అన్నారు. ఇక, ఏఏసీ నాయకులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ, చర్చలు మాత్రం ఓ కొలిక్కి రావటం లేదు.
ఇవి కూడా చదవండి
బీసీలకు దసరా కానుకగా 42% రిజర్వేషన్లు: తెలంగాణ మంత్రులు
అతిగా లాబీయింగ్ చేయొద్దు.. ట్రంప్కు నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరిక
Updated Date - Sep 29 , 2025 | 04:55 PM