US Tariffs: నేటి నుంచే అమెరికా అదనపు మోత
ABN, Publish Date - Aug 27 , 2025 | 02:36 AM
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్నా వినడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన 25శాతం అదనపు సుంకాలు బుధవారం 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి....
అమల్లోకి మరో 25% సుంకాలు
మొత్తంగా 50 శాతానికి చేరుతున్న సుంకాలు
5.25 లక్షల కోట్ల భారత ఎగుమతులపై ప్రభావం
వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం’
న్యూఢిల్లీ, ఆగస్టు 26: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్నా వినడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన 25శాతం అదనపు సుంకాలు బుధవారం (27వ తేదీ) నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25శాతం సుంకాలు వసూలు చేస్తుండగా.. దీనితో కలిపి 50శాతానికి చేరుతున్నాయి. ఈ మేరకు అమెరికా అంతర్గత భద్రతా విభాగం తాజాగా నోటీసు జారీ చేసింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో.. భారత్పై విధించిన సుంకాలే అత్యధికం కావడం గమనార్హం. తాజా పెంపుతో అమెరికాకు భారత్ నుంచి జరిగే సుమారు రూ.5.25 లక్షల కోట్ల (60 బిలియన్ డాలర్ల) ఎగుమతులపై ప్రభావం పడుతుందని అంచనా. ప్రస్తుతానికి అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉన్న మొబైల్ ఫోన్లు, పలు రకాల ఎలకా్ట్రనిక్ వస్తువులు, ఫార్మా మినహా.. మిగతా అన్ని రంగాలకు సుంకాల దెబ్బతగలనుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముడిపెట్టి..
అమెరికాకు భారత్ భారీగా ఎగుమతులు చేస్తూ.. అమెరికా ఉత్పత్తుల దిగుమతిపై మాత్రం భారీగా టారి్ఫలు విధిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తుల దిగుమతులకు అనుమతించాలని, టారి్ఫలు తగ్గించాలని.. ఈ మేరకు వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ దేశంలోని రైతులు, చిన్న పరిశ్రమలకు దెబ్బతగులుతుందంటూ భారత్ నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ భారత్పై 25శాతం సుంకాలు విధించారు. అవి ఆగస్టు 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక రష్యా చమురును విక్రయించడం ద్వారా వస్తున్న సొమ్ముతోనే ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తోందని.. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై 25శాతం అదనపు సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్పై యుద్ధం నిలిపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి తెచ్చే క్రమంలోనే భారత్పై అదనపు సుంకాలు విధించినట్టు కూడా ప్రకటించారు. ప్రస్తుతం భారత్తోపాటు బ్రెజిల్పై 50శాతం, మయన్మార్పై 40, థాయ్లాండ్, కాంబోడియాలపై 36, బంగ్లాదేశ్పై 35, ఇండోనేషియాపై 32, చైనా, శ్రీలంకలపై 30, మలేసియాపై 25, ఫిలిప్పీన్స్, వియత్నాంలపై 20, పాకిస్థాన్పై 19శాతం టారి్ఫలను అమెరికా అమలు చేస్తోంది.
ఏయే రంగాలు, ప్రాంతాలపై ఎంత ప్రభావం?
2024-25లో భారత్-అమెరికా మధ్య సుమారు 11.5 లక్షల కోట్ల (131.8 బిలియన్ డాలర్లు) వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ నుంచి రూ.7.57 లక్షల కోట్ల (86.5 బిలియన్ డాలర్లు) ఎగుమతులు జరగ్గా.. రూ.4లక్షల కోట్ల (45.3 బిలియన్ డాలర్లు) మేర దిగుమతులు జరిగాయి. ప్రస్తుతం 50శాతం టారి్ఫలతో భారత్ నుంచి జరిగే రూ.5.25 లక్షల కోట్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ అధిక సుంకాల కారణంగా అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు ఏకంగా 50శాతం పెరిగిపోతాయి. అదే సమయంలో టారి్ఫలు తక్కువగా ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియా వంటి దేశాల ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉంటాయి. దీనితో భారత ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయి ఇక్కడి నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి.
ప్రధానంగా విశాఖపట్నం కేంద్రంగా తూర్పు తీర ప్రాంతాల నుంచి అమెరికాకు సుమారు రూ.20 వేల కోట్లకుపైగా విలువైన రొయ్యలు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు 50శాతం సుంకంతో ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది.
ముంబై, సూరత్ వేదికగా ఉన్న రత్నాలు, ఆభరణాల పరిశ్రమలు (రూ.87 వేల కోట్ల ఎగుమతులు).. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటకల నుంచి ఎగుమతయ్యే వస్త్రాల పరిశ్రమలు (రూ.95 వేల కోట్ల ఎగుమతులు) దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ‘‘అదనపు సుంకాలు భారత వస్త్ర పరిశ్రమపై తీవ్ర భారంగా మారుతాయి. ఉద్యోగుల తొలగింపు, ఇతర వ్యయాల తగ్గింపుపై పరిశ్రమలు దృష్టిపెట్టాల్సి వస్తుంది..’’ అని అప్పెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) ప్రధాన కార్యదర్శి మిథిలేశ్వర్ ఠాకూర్ పేర్కొన్నారు.
కార్పెట్లు, హస్తకళాకృతులు, ఫర్నీచర్, పాదరక్షలు, బాస్మతి బియ్యం, మసాలాలు, టీ, స్టీలు, అల్యూమినియం, రాగి, ఆర్గానిక్ రసాయనాలు, యంత్ర పరికరాల తయారీ పరిశ్రమలపైనా గణనీయంగా ప్రభావం పడుతుంది.
అదనపు సుంకాల ప్రభావంతో 2025-26లో అమెరికాకు భారత ఎగుమతులు రూ.4.34 లక్షల కోట్ల (49.6 బిలియన్ డాలర్ల)కు పడిపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 27 , 2025 | 02:36 AM