Telangana Identity: ఆధిపత్యం కోసం అసంబద్ధ వాదనలు
ABN, Publish Date - Sep 11 , 2025 | 01:44 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా అన్ని రంగాల్లో ఆంధ్రాధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, అదనంగా ఉత్తరాది ఆధిపత్యం చొచ్చుకొస్తున్న సందర్భంలో, ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ ఏర్పడిన...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా అన్ని రంగాల్లో ఆంధ్రాధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, అదనంగా ఉత్తరాది ఆధిపత్యం చొచ్చుకొస్తున్న సందర్భంలో, ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ ఏర్పడిన సంగతి, నెల నెలా ఒక్కొక్క రంగంలో ఆంధ్రాధిపత్యం గురించి రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ పరంపరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం ఏర్పాటు, మరో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మృతి వనంకు స్థలం ఇస్తున్నట్లు గత నెలలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘మాకెందుకు మీ విగ్రహాలు’ అనే శీర్షికన పైన పేర్కొన్న కొన్ని తీర్మానాలు చేసిందీ పాఠకులు గమనించి ఉంటారు.
ఈ తీర్మానాలకు స్పందనగా బి.ఆర్. బాపూజీ జూలై 29న ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ‘ప్రాంతీయ అస్తిత్వం: భ్రమలూ, వాస్తవాలూ!’ అనే వ్యాసంలో పాత వాదననే మళ్ళీ వినిపించినారు. ఆ పాచి వాదనకు కొత్త పాఠకుల కోసం పాత సమాధానాన్నే మళ్ళీ ఇవ్వాల్సి వస్తున్నది.
ఒకటి– ‘ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కలిగించే భ్రమ’ ఆ ప్రాంతంలో ఉన్న అసమానతలను (వర్గ, కుల, లింగ, తదితర) వైరుధ్యాలను చూడనివ్వదు. ‘స్థానికంగా ఉన్న ఇన్ని రకాల అసమానతల్ని వైరుధ్యాల్ని ప్రాంతీయ అస్తిత్వ స్పృహ అనే మాయ తెర కప్పివేస్తుంది’ ఇదీ బాపూజీగారి వాదన.
ఈ ఎరుక మాకు తెలియనిది కాదు. ఈ అసమానతల వల్ల క్షోభపడే ప్రతివర్గం తన అస్తిత్వ రక్షణ కోసం పోరాడుతూనే ఉన్నది. ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమం, బి.సి. రిజర్వేషన్ల కోసం నడుస్తున్న ఉద్యమం అందుకు ప్రబల నిదర్శనాలు. అలాగే ముస్లింలు, స్త్రీలు, ఆదివాసీలు ఎవరైనా, అందరూ అన్ని పోరాటాలను చేయరు. తమ పోరాటం తాము చేస్తరు. మేం ప్రాంత అసమానత గురించి చేస్తున్నం. వర్గ ప్రాతిపదికన చేసే పోరాటానికి ఇవేవీ ఆటంకం కాదు.
రెండు– ఉద్యమ కాలంలోని ‘సామాజిక తెలంగాణ’, ‘ప్రజాస్వామిక తెలంగాణ’ నినాదాలు తెరమరుగైనవి అనేది ఆయన వాదన. జాతీయోద్యమ కాలంలో కూడ దేశ స్వాతంత్య్రానికంటే సామాజిక అసమానతల పరిష్కరణ ముఖ్యమనీ, ఆర్థిక అసమానతల నిర్మూలన ముఖ్యమనీ వాదనలు వచ్చినవి. (అందుకే అంబేడ్కరిస్టుల మీద, కమ్యూనిస్టుల మీద జాతీయోద్యమ వ్యతిరేకులనే నింద వేసినారు). దేశ విముక్తి తర్వాత ఈ వాదనలు కనుమరుగు కాలేదు. అట్లాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడ పైన పేర్కొన్న నినాదాలు కొనసాగుతూనే ఉన్నవి. మరి బి.ఆర్. బాపూజీ బాధ ఏమిటి? ఆ నినాదాల లక్ష్యంమీద దృష్టిపెడితే తమ ప్రాంత ఆధిపత్యం మీద దృష్టి తగ్గుతది అనే.
మూడు– అంబేడ్కర్, ఫూలే, జగ్జీవన్రామ్, గాంధీలు కూడా స్థానికేతరులే కాబట్టి వాళ్ల విగ్రహాల్ని కూడా వారి ప్రాంతాలకు తరలించాలి కదా అన్నది బి.ఆర్. బాపూజీ మరో వాదన.
అంబేడ్కర్ తదితరులు ప్రాంతాలకతీతంగా దేశం మొత్తానికీ ఐకన్స్. వాళ్లెవరూ మా ఐడెంటీటిని భంగపరిచే సమస్యతో సంబంధం ఉన్నవారు కాదు. పైగా అంబేడ్కర్ చిన్న రాష్ట్రాల అనుకూలవాది. ఫూలే సకల ఆధిపత్యాలను ధిక్కరించిన యోధ.
మా అస్తిత్వాన్ని ఏనుగు తొక్కినట్టు తొక్కిన వారితోనే మా పేచీ అంతా. 369 మందిని పొట్టనబెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డికి ఆ మహానుభావులకి పోలిక ఏమిటి? ‘‘తెలుగు తేజం’’ పేరుతో తెలంగాణ ఆక్రమణకు నాలుగులేన్ల దారి వేసిన ఎన్టీఆర్కు, ఆ శిఖర సమానులకు పోలిక ఏమిటి? తెలంగాణ ఉద్యమాన్ని చీల్చి చెండాడిన రాజశేఖరరెడ్డికి ఆ దార్శనికులకు పోలిక ఏమిటి?
తెలంగాణలో ఉన్న విగ్రహ వ్యక్తుల పట్ల మాకు వ్యతిరేకత లేదు. వాళ్ళు మీ ప్రాంత ఆధిపత్య ప్రతీకలు, మీ భావజాల ప్రతీకలు కావడం పట్లనే మా వ్యతిరేకత. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కాబట్టి ఇక్కడ స్థానం ఉండాలంటే, మా ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, మా పి.వి. నరసింహారావు, మా అంజయ్య విగ్రహాలెన్ని ఉన్నవి మీ ప్రాంతంల?
నాలుగు – ‘2009 టాంక్బండ్ ఘటన తర్వాత (మిలియన్ మార్చ్), ఈ వార్తవల్ల (తెలంగాణ పరిరక్షణ వేదిక తీర్మానాల వార్త) మరోసారి తేలింది ఏమంటే విగ్రహాలకు ప్రాంతీయ భేదాలుంటాయ’’ని, ఆయన మరో ఉవాచ.
అవును కచ్చితంగా ఉంటయ్. ఉండగూడదనేది ఆదర్శవాద ముసుగులోని ఆధిపత్య భావన.
అయిదు– ‘‘ప్రాంతీయ అస్తిత్వ మత్తులో అందరినీ నెత్తిన పెట్టుకోవాలా’’ అనేది ఇంకో వక్రీకరణ.
ఆధిపత్య అహంకారానికి ‘అస్తిత్వం మత్తే’ సరైన జవాబు. ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో మేం నిర్ణయించుకుంటం. అడగడానికి మీరెవరు? టాంక్ బండ్ మీద మీ విగ్రహాలు మీరు తీసుకెళ్తే తెలంగాణ స్ఫూర్తిదాతల విగ్రహాలు నెలకొల్పే విషయంలో మా లిస్ట్ తయారుగా ఉంది. అందులో వివిధ సామాజిక వర్గాల (కుల, లింగ, మత) నిష్పత్తి కూడ సిద్ధంగా ఉంది. చరిత్రలో ‘ఎవరిని తిరస్కరించాలో, ఎవరిని ప్రతిష్ఠించాలో’ మాకు తెలుసు. మీ లాంటి వాళ్ల పిడివాదనా తెలుసు. తెలంగాణ అస్తిత్వం మత్తు అని, భారతదేశ స్వాతంత్ర్యం బూటకం అని మీరు అంటే అది భౌగోళిక విముక్తి అని మేం అంటం. మేం గతంలోని (భారతదేశ, తెలంగాణ) మంచిని స్వీకరిస్తం. అందుకే మిలియన్ మార్చ్లో శ్రీశ్రీ, జాషువా విగ్రహాలను కూలగొట్టేందుకు సందేహించినారు మావారు.
ఆరు– రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, పౌరహక్కుల వ్యతిరేక తదితర చట్టాల గురించి, ప్రస్తావించినారు. యెస్, వాటి గురించి పోరాడాలె. పోరాడుతం. ప్రాదేశిక అసమానతల గురించీ పోరాడుతం.
తెలంగాణ పరిరక్షణ వేదిక
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
Updated Date - Sep 11 , 2025 | 01:44 AM