PoK Uprising Grabs Global Attention: ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పీఓకే ఆందోళన
ABN, Publish Date - Oct 14 , 2025 | 05:26 AM
మొన్న బంగ్లాదేశ్, నిన్న నేపాల్, తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రజలు తమ ప్రాథమిక సమస్యలపై ప్రశ్నిస్తూ, రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. పీఓకేలో ఉన్న ఫెడరల్ గవర్నమెంట్కి, ఆందోళనకారులకీ...
మొన్న బంగ్లాదేశ్, నిన్న నేపాల్, తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రజలు తమ ప్రాథమిక సమస్యలపై ప్రశ్నిస్తూ, రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. పీఓకేలో ఉన్న ఫెడరల్ గవర్నమెంట్కి, ఆందోళనకారులకీ మధ్య చర్చలు విఫలమయ్యే నాటికి, కనీసం 10 మంది ఆందోళనకారులు, ముగ్గురు పోలీసులు చనిపోయారు, వందలాది ప్రజలు గాయపడ్డారు. అక్టోబర్ 4న అధికారులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనకారుల మధ్య చర్చలు జరిగి, ఆందోళనలు విరమించాలని ఒక అంగీకారానికి వచ్చారు.
ప్రధాన సమస్యలపై ఆందోళన మే నెలలో ప్రారంభమై, ఆగస్టు నాటికి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వాన మిలిటెంట్ రూపం తీసుకుంది. ఆందోళనకారులు 38 అంశాలతో కూడిన డిమాండ్స్ను అధికారులకు సమర్పించి, అవి పరిష్కరించకపోతే తాము తిరిగి రోడ్లమీదకు వస్తామని ప్రకటించారు. ఆందోళన ప్రారంభమైన ఐదవ రోజున పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆగిపోయింది. ఏడవ రోజు కమ్యూనికేషన్ సిస్టం ఆపివేశారు. చివరికి అక్టోబర్ 1న పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ హై పవర్ డెలిగేషన్ను పీఓకే రాజధాని ముజఫరాబాద్కు చర్చల కోసం పంపించారు. ఆందోళనకారులు లేవనెత్తిన ఆహారం, విద్యుత్ ధరలు పెరుగుదల, నిరుద్యోగం తదితరాలపై రెండు రోజులపాటు చర్చలు జరిగిన తర్వాత ఆందోళనను విరమించాలని ఒక అంగీకారానికి వచ్చారు. 25 అంశాలతో కూడిన అంగీకార పత్రంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. వాటిలో ముఖ్యమైనవి.. కాల్పుల్లో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, అక్రమ కేసులను రద్దు చేయాలని, పౌరులకు హెల్త్ కార్డులు ఇవ్వటానికి నిధులు విడుదల చేయాలని, మంత్రులను 20 మందికి తగ్గించాలని, వీటితో పాటు అంగీకరించిన హామీలను అమలు చేయటానికి కమిటీని ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిసిటీ సిస్టం అభివృద్ధి చేయటానికి ఫండ్స్ కేటాయించాలని తదితర అంశాలతో ఒప్పందం కుదిరింది.
పీఓకే గురించి మనం చాలా కాలంగా వింటున్నాం. ఈ మధ్య పహల్గాంలో ఉగ్రవాద దాడులకు ప్రతిగా భారత్ సిందూర్ పేరుతో చేసిన ప్రతిదాడుల సందర్భంగా హోం మంత్రి అమిత్ షా పీఓకే మనదేనని, ఇవాళ కాకపోయినా రేపైనా దానిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు కూడా. 1994లోనే పీఓకే భారతదేశ అంతర్భాగమని, ఆజాద్ కశ్మీర్ ప్రభుత్వాన్ని గుర్తించటం లేదని భారత పార్లమెంటు ప్రకటించింది. పీఓకేను ‘ఆజాద్ జమ్మూ–కశ్మీర్’గా పాకిస్థాన్ ప్రకటించి తన అధీనంలో కొనసాగిస్తున్నది. రాజధానిగా ముజఫరాబాద్ను నిర్ణయించి, ప్రధానమంత్రి గల స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ దానిపై పూర్తి అధికారాలను పాకిస్థాన్ ప్రభుత్వం తన చేతులలో ఉంచుకుంది. పీఓకేలో జనాభా సుమారు 40 లక్షల మంది ఉంటారు. పీఓకేకు ప్రత్యేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉంటాయి. పాకిస్థాన్ పార్లమెంటులో ఇది భాగం కాదు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వంలోని కశ్మీరీ ఎఫైర్స్, గిల్గిట్, బాల్టిస్థాన్ వ్యవహారాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ అధీనంలో ఇది ఉంటుంది. పేరుకు మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రం.
పాకిస్థాన్ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లోని పశ్చిమ ప్రాంతాలను, చైనా–పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న గిల్గిట్, బాల్టిస్థాన్ ప్రాంతాలను 1947–48లో మొదటి పాకిస్థాన్–భారత్ యుద్ధం సందర్భంగా ఆక్రమించుకుంది. యునైటెడ్ నేషన్స్ దీన్ని వివాద ప్రాంతంగా, దీనికి శాంతియుత పరిష్కారం జరగాలని కోరుతున్నది. దీని సార్వభౌమత్వాన్ని మెజారిటీ దేశాలు గుర్తించటంలేదు.
తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున కుదిపేసిన ఆజాద్ కశ్మీర్ ప్రజల ఆందోళనకు అనేక దేశాలు సంఘీభావం ప్రకటించినా, భారత ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు! కారణం ఆజాద్ కశ్మీరీ ప్రజలు స్వతంత్ర దేశంగానే ఉండాలని కోరుకుంటున్నారే కానీ, భారతదేశంలో కలిసిపోవాలన్న ఆకాంక్షను ప్రకటించలేదు! ఇప్పటికీ 1977లో ఏర్పడిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో ఒక సంస్థ పాకిస్థాన్, ఇండియా దేశాల నుంచి ఆ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేస్తూనే ఉంది. భారతదేశం ఈ సంస్థని టెర్రరిస్ట్ గ్రూపుగా నిషేధించింది. జమ్మూ–కశ్మీర్ భారతదేశంలో భాగంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఆర్టికల్ 370ని 2019లో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. నాటి నుంచి దానిని తిరిగి పునరుద్ధరించాలని అక్కడి ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లో అపారంగా ఉన్న సహజ వనరులను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలలో భాగంగా బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370ని ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రద్దు చేసింది. ఏది ఏమైనా పీఓకే ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, ముఖ్యమైన సమస్యలపై పాకిస్థాన్ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా చేసిన ఆందోళన ఫలితంగా పీఓకే మరొకసారి ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
n ముప్పాళ్ళ భార్గవ శ్రీ
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 14 , 2025 | 05:26 AM